
సంగారెడ్డి జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన డబ్బును తన దగ్గర నుంచి ఎవరో కొట్టేశారని ఓ వ్యక్త ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేయాలని టవర్ పై నుంచే నిరసన తెలిపాడు. డబ్బులు ఎవరు తీసుకున్నారో తిరిగి ఇచ్చేయాలని లేదంటే.. టవర్పై నుంచి దూకేస్తానని పట్టుపట్టాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు డబ్బు తిరిగిస్తామని హామీ ఇవ్వడంతో సదురు వ్యక్తి పై నుంచి దిగొచ్చాడు. ఈ ఘటన స్థానికంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జోగిపేటకు చెందిన మక్కల అశోక్ అనే యువకుడికి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వార్డు కౌన్సిలర్ శుక్రవారం రాత్రి 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుకు మరికొన్ని డబ్బులు కలిపి కొత్త సెల్ ఫోన్ కొనాలని అశోక్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే శనివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి తన జేబులో ఉండాల్సిన రూ.4వేలు కనిపించలేదు. దీంతో ఎవరో తన ఇంట్లోకి వచ్చి ఆ డబ్బులు ఎత్తుకెళ్లి ఉంటారని అశోక్ నిర్ధారించుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాని గురై నేరుగా స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు.
ఎవరో ఇంట్లోకి వచ్చిన తన డబ్బులు ఎత్తుకెళ్లారని.. తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని, లేదంటే పై నుంచి దూకేస్తానని గట్టి గట్టిగా అరుస్తూ, బెదిరిస్తూ హల్చల్ చేశాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అతని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న అశోక్ భార్య పోచమ్మ, కుటుంబ సభ్యులు.. డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో శాంతించిన అశోక్.. సెల్ టవర్ దిగి కిందికి వచ్చాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఇందరుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.