Viral Video : ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక కామెడీ సీన్ చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ అయిన కుమార్ సంగక్కర ముగ్గురూ కలిసి పాత స్నేహితుల్లా పలకరించుకున్నారు. ఎడ్జ్బాస్టన్ లో రెండో రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు మైదానంలో వీళ్ళు ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సంగక్కర ఏదో అనగానే జైస్వాల్ చాలా సంతోషపడిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ క్రికెట్ లెజెండ్ను ఎంతో ఉత్సాహంగా కౌగిలించుకున్నాడు. జైస్వాల్ చేసిన ఈ పని పక్కనే ఉన్న ధ్రువ్ జురెల్ను ఆశ్చర్యపరిచింది. జైస్వాల్ ఆత్మీయతను చూసి జురెల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. సంగక్కర కూడా జైస్వాల్ చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయి, నవ్వుతూనే ఆ కౌగిలింతను స్వీకరించాడు.
జైస్వాల్ బర్మింగ్హామ్లో ఈ సిరీస్లో రెండో సెంచరీని కేవలం 13 పరుగుల తేడాతో మిస్ చేసుకున్నాడు. కానీ, ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్లలో అతను టాప్ ఆర్డర్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా నిలబడ్డాడు. రెండో టెస్టులో 87 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 269పరుగులతో అనేక రికార్డులను తిరగ రాశాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులను సాధించింది. గిల్తో పాటు, రవీంద్ర జడేజా(89), వాషింగ్టన్ సుందర్(42) పరుగులు చేశారు.
Kumar Sangakkara with Jaiswal and Jurel. 🥹❤️ pic.twitter.com/biIl9GBioR
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025
తర్వాత ఇంగ్లాండ్ ప్రారంభంలోనే తడబడింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ తొలి స్పెల్తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ఆకాష్ దీప్ తన మొదటి ఓవర్లో 12 పరుగులు ఇచ్చి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, రెండో ఓవర్లో వరుసగా రెండు వికెట్లతో చెలరేగిపోయాడు. అతను బెన్ డకెట్ ను ఫస్ట్ స్లిప్లో గిల్ క్యాచ్ పట్టగా ఔట్ చేశాడు. ఆ వెంటనే ఓలీ పోప్ను కూడా కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగా పెవిలియన్ పంపాడు. కేఎల్ రాహుల్ క్యాచ్ను ఒకసారి జారవిడిచి రెండోసారి పట్టుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్ మరో వికెట్ తీసుకున్నాడు. ఈ విధంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరును 77/3కు చేర్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..