
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక భారీ మైథలాజికల్ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను, అత్యున్నత సాంకేతికతను వాడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సునామీ సృష్టిస్తుందోనని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే, ప్రేక్షకులకు వెండితెరపై ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో పాత్రలో మాత్రమే కాదు, శ్రీరాముడిగా కూడా కనిపించి షాక్ ఇవ్వబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ సినిమాలో మరిన్ని కీలక పాత్రలు ఉండనున్నాయట. మరి ఈ సినిమాలో దాగి ఉన్న ఆ రహస్య పాత్రలు ఏంటి? అఘోరా వేషంలో కనిపించబోయే ఆ ప్రముఖ నటుడు ఎవరు?
విజువల్ ఫీస్ట్..
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్, టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన ‘రుద్ర’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఉన్న అసలైన ట్విస్ట్ ఏంటంటే.. మహేష్ బాబు త్రేతాయుగం నాటి శ్రీరాముడిగా కూడా మెరవబోతున్నారు. రామాయణంలోని పతాక ఘట్టాలను రాజమౌళి తనదైన శైలిలో, హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో ఐమ్యాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. మైథాలజీకి సంబంధించిన ఈ కీలక ఘట్టాలు సినిమాకే ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఆయన పోషిస్తున్న ‘కుంభ’ అనే పాత్రలో విలనిజం ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో విలన్ ఎంట్రీకి సంబంధించిన ఒక భారీ ‘పడవ ఫైట్’ సీక్వెన్స్ను రాజమౌళి షూట్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్ సినిమాలో అత్యంత కీలకంగా ఉండబోతోంది. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమెకు సంబంధించిన కీలక షెడ్యూల్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.
ముగ్గురు దేవుళ్లు..
ఈ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేసే మరికొన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. సినిమాలో సృష్టిలయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రలు కూడా ఉంటాయట. ఈ ముగ్గురు దేవుళ్ల పాత్రల్లో ఏ ప్రముఖ స్టార్ హీరోలు కనిపిస్తారనేది ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది. ఒకవేళ అగ్ర హీరోలు ఈ పాత్రల్లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. వీటితో పాటు సినిమాలో ఒక ‘అఘోరా’ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ అఘోరా పాత్రలో రాజమౌళి ఎవరిని దించుతున్నారో అన్నది ప్రస్తుతానికి గుట్టుగా ఉంచారు. ఆ పాత్ర చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
పాన్ వరల్డ్ రిలీజ్..
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సంచలన సాంకేతికతతో రూపొందుతున్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా 2027, ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారు. మైథాలజీ అంశాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు మేకోవర్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు ప్రతిదీ హాలీవుడ్ లెవల్ లో ఉండేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి విజన్ కు మహేష్ బాబు నటన తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. రుద్రగా, శ్రీరాముడిగా మహేష్ బాబు విశ్వరూపం చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.