దేశవ్యాప్తంగా సర్వీసులు అందిస్తున్న వందే భారత్ రైళ్ల గురించి తెలుసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లతో పాటు దేశంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లల్లో ఛార్జీల వివరాల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఛార్జీలు అధికంగా ఉన్నాయని కొంతమంది విమర్శిస్తుండగా.. కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. వందే భారత్ రైళ్లల్లో ఛార్జీల గురించి బుధవారం లోక్సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కిలోమీటర్కు కేవలం రూ.2.19
వందే భారత్ ఏసీ చైర్ కార్ కోచుల్లో 300 నుంచి 400 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు కిలోమీటర్కు రూ.2.19 మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విదేశాల్లో ఇలాంటి సేవల కంటే భారత్లో ధరలు తక్కువని, అధిక ప్రయాణికులతో పాటు పూర్తి ఆక్సుపెన్సీని పెంచడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కంటే దేశంలో ధరలు తక్కువగా వసూలు చేస్తున్నామని చెప్పారు. ఆ దేశాల్లో కిలోమీటర్కు రూ.7 నుంచి రూ.20 మధ్య వసూలు చేస్తున్నారని లోక్సభలో అశ్విని వైష్ణవ్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలో సామాన్యులకు అందుబాటులోకి ఉండేలా వందే భారత్ సేవలను నడుపుతున్నామన్నారు. రైల్వే ఛార్జీలు నిర్ణయించేటప్పుడు సేవా ఖర్చు, విలువ, సేవల రకం, అందించే సౌకర్యాలు, భరించగలిగే సామర్థ్యం, సామాజిక ఆర్ధిక విషయాలను రైల్వేశాఖ పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
164 వందే భారత్ సర్వీసులు
2019లో వందే భారత్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 రూట్లల్లో 164 రైలు సర్వీసులు నడుస్తున్నాయి. తక్కువ ఛార్జీలతో వేగవంతమైన ప్రయాణంతో పాటు మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్, ఆటోమేటెడ్ ప్లగ్ డోర్లు, ఎర్గోనామిక్ సీట్లు, మినీ ప్యాంట్రీ, సీసీటీవీ కెమెరాలు, కవచ్ భద్రతా వ్యవస్థను కలిగి ఉన్నాయి. వందే భారత్ కోసం అవుతున్న సేవా ఖర్చు కంటే ప్రయాణికుల నుంచి తక్కువగా వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. వందే భారత్ రైళ్లు 100 శాతం ఆక్సుపెన్సీతో నడుస్తుండగా.. చాలా మార్గాల్లో అధిక రద్దీ కూడా ఉంటుంది. అటు సాధారణ తరగతి ఛార్జీలపై భారత రైల్వేలు అతి తక్కువ ధరకే ప్రయాణాన్ని అందిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పొరుగు దేశాలతో పోల్చుకుంటే కిలోమీటర్కు దాదాపు 20 పైసలుగా ఉందన్నారు. ఇది పాకిస్తాన్లో 54 పైసలు, బంగ్లాదేశ్లో 37 పైసలుగా ఉండగా.. శ్రీలంకలో 51 పైసలుగా ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.