తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక పురపాలికలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ కూడా చాలా మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇవ్వగా.. బీజేపీ కొన్ని మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. కాగా కొన్ని చోట్ల అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం ఆసక్తికర పరిణామంగా నిలుస్తోంది.
వడ్డేపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డుల్లో 8 చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ పీఠాన్ని ఆ పార్టీ ఖాయం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో స్థానంలో మాత్రమే గెలిచాయి.
కార్పొరేషన్లలో ఇలా..
మధ్యాహ్నం 3 గంటల వరకు వెలువడిన ఫలితాల మేరకు 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లలో కాంగ్రెస్ 93 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 28 డివిజన్లలో బీఆర్ఎస్, బీజేపీ 9, ఇతరులు 27 స్థానాల్లో విజయం సాధించారు.
మున్సిపాలిటీల్లో ఇలా..
కాగా 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2582 వార్డుల్లో 2581 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1229 వార్డుల్లో అధికార కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 661, బీజేపీ 231, ఇతరులు 227 చోట్ల గెలుపొందారు.