హైదరాబాద్, ఆగస్ట్ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు రంగం సిద్ధమైంది. గత ఏడాది నుంచి నిరుద్యోగులను ఊరిస్తున్న ఆర్టీసీ సంస్థ తాజాగా కీలక అప్డేట్ జారీ చేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. మొత్తం 3,038 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నాట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం (ఆగస్టు 7) ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు TGSRTCలో మొత్తం 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలైనట్లు ఆయన ప్రకటించారు. ఈ పోస్టులన్నింటినీ ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందని ఆయన అన్నారు. ఈ నియామక ప్రక్రియ మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి మోసాలకు తావులేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
అయితే ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి అడ్డదారుల్లో ఎవరికీ కూడా ఉద్యోగాలు రావన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.