మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని 43 శైవక్షేత్రాలకు రాకపోకలు సాగిచేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కె.పి.హెచ్.బి, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సైతం ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ టికెట్ ధరలను సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించగా.. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ సవరణ చేసిన ఛార్జీలు కేవలం ఈ నెల 14నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే అమల్లో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రయాణికులకు తెలుసుకునేలా స్పెషల్ సర్వీసులకు బస్సులకు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్లను సైతం ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
శివరాత్రి నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఆర్టీసీ విసి అండ్ ఎండీ వై.నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. గత శివరాత్రితో పోల్చితే ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. .
మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఆర్టీసీ కల్పించింది. ముందస్తు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు www.tgsrtcbus.in వెబ్సైట్ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.