ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి నిరూపించింది ఓ ప్రేమ జంట. దేశాలు వేరైనా ప్రేమ విశ్వవ్యాప్తం అని చాటింది ఆ జంట. పెద్దలను ఒప్పించి మెప్పించి బందువుల సమక్షంలో అంగరంగ వైభవంగా మూడు ముళ్లతో ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఈ వేడుక సింగరేణి ఖిల్లా మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన ప్రణీత్ అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్.. అమెరికాకు చెందిన లవినశ్రీ (తమీ)తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకుందామనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఫిబ్రవరి 20న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రణీత్ తండ్రి గంగిపల్లి రాములు సింగరేణి ఉద్యోగి కాగా.. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రణీత్ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా, మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి లవిన శ్రీని మనువాడాడు. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన బందువులంతా ఈ జంటను మనస్పూర్తిగా ఆశీర్వదించారు.