తెలంగాణలోని ఉర్దూ మీడియం పాఠశాలల టైమింగ్స్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళలను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 01.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయి. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలు ఈ మార్పును అమలు చేయాలి. అలాగే సాధారణ పాఠశాలల్లోని ఉర్దూ మీడియం సెక్షన్ల కు కూడా ఇదే వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఉర్దూ మీడియం డైట్ కళాశాలలు ఇదే తరహాలో నడుస్తాయి
పనివేళలు తగ్గించడం వల్ల కలిగే పని గంటల నష్టాన్ని పూడ్చేందుకు విద్యాశాఖ ప్రత్యేక సూచనలు చేసింది అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఒక అదనపు రోజు పని చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్స్ గతేడాది మాదిరిగానే రెండు పని దినాల్లో అదనంగా అర గంట పని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు , రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..