తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళల అందరికి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టేందుకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఆధార్ కార్డు ప్రమాణికంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా అనుమతిస్తున్నారో.. ఈ కార్డులు జారీ చేసిన తర్వాత స్మార్ట్ కార్డుల ఆధారంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. అంటే వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే ఈ స్మార్ట్ కార్డుల జారీ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. వీటి కోసం మూడు నమూనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని.. వాటిలో ప్రభుత్వం ఒక నామునాను ఖరారు చేసినట్టు తెలిపారు. వచ్చే నెల నుంచే ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండి తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.