
తెలంగాణలోని కృష్ణా నది తీరంలో పురాతన నాగరికతకు చెందిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కృష్ణా నదీ తీరంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం వద్ద సుమారు మూడు వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో ఒక పురాతన నగర శిథిలాలను చరిత్రకారులు గుర్తించారు. మూడు ఏళ్ల నాటి ఇనుప యుగపు సమాధులు, నివాస గృహాలు, కుండపెంకులు వంటి పురావస్తు సాక్ష్యాలు వెలుగు చూశాయి. పురావస్తు ఆధారాలను బట్టి ఈ నగరం సుమారు 3 వేల సంవత్సరాల క్రితం నుంచి క్రీ.శ.15వ శతాబ్దం వరకు నిరంతరంగా మనుగడ సాగించినట్లు పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. మధ్యయుగ కాలం(క్రీ.శ.10-15 శతాబ్దాలు)లో నిర్మితమైన కోట గోడలు, బురుజులు, ధాన్యాగారాలు, ఆలయాలు, బావులు, ఇళ్లు, శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇనుప యుగానికి చెందిన వందలాది శిలా సమాధులు, ఇనుము తయారీ ఆనవాళ్లతో పాటు కందూరి చోళులు, రేచర్ల పద్మనాయకుల కాలం నాటి కోట గోడలు, ఆలయాలు బయటపడ్డాయి. అలాగే కాకతీయ రాణి రుద్రమదేవి కాలం నాటి రహస్య ధాన్యాగారాలుగా భావిస్తున్న సున్నపుపూత పూసిన గుండ్రటి నిర్మాణాలు సైతం ఇక్కడ కనిపించాయి. ఇక్కడ కనిపించే శిలా సమాధులను స్థానికులు ‘వీరుల సమాధులు’గా పిలుస్తారు. దీని వల్ల వీరులపాడు, వీరప్పగూడెం వంటి పేర్లు వచ్చాయి. ఈ పురాతన శిథిలాలు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని చరిత్రను, పూర్వపు సంస్కృతులను అర్థం చేసుకోవడానికి దోహదపడుతున్నాయనీ ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలతో పద్మనాయకుల కాలం నాటి లక్ష్మీనరసింహాలయం సహా పలు విగ్రహాలు దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక వారసత్వ సంపద ధ్వంసం కాకముందే కనీసం డాక్యుమెంటేషన్ అయినా చేయాలని ఆయన పురావస్తు శాఖను కోరారు.