తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో కొత్త నేషననల్ హైవే నిర్మించేందుకు సిద్దమైంది. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడబెళ్లూరు వరకు ఈ కొత్త జాతీయ రహదారి ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ తాజాగా లభించింది. శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహబూబ్నగర్-గుడబళ్లూరు కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు నిధుల మంజురుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు ప్రాంతాల మధ్య నాలుగు లైన్ల హైవే నిర్మించనుండగా.. ఇందుకోసం తొలి విడతగా రూ.3 వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోవా వెళ్లేవారికి ఊరట
హైదరాబాద్-గోవా ఎకనామిక్ కారిడార్లో ఈ కొత్త జాతీయ రహదారి ఉండనుంది. దీంతో హైదరాబాద్ నుంచి గోవాకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. రాయచూర్, మంత్రాలయం మీదుగా ఈ హైవే ఉంటుంది. 80.01 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో నిర్మించనున్నారు. మహబూబ్నగర్ నుంచి హైవే మొదలుకానుండగా.. దేవరకద్ర, మరకిల్, మఖ్తల్, మాగునూర్ మీదుగా రాయచూరు సరిహద్దుల వరకు వెళుతుంది. నేషనల్ హైవే పక్కన ప్రత్యేక బైపాస్లు కూడా నిర్మించనున్నారు. దీని వల్ల వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. మాగనూరు, మరకిల్, ముఖ్తల్, మహబూబ్ నగర్, దేవరకద్ర వద్ద ఈ బైపాస్లు ఉంటాయి. దీంతో ఆ పట్టణాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయోజనం
ప్రస్తుతం మహబూబ్నగర్-రాయచూర్ మార్గంలో రెండు లైన్ల రహదారి ఉండగా.. దీనిని ఇప్పుడు 4 లైన్లకు మార్చుతున్నారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. దాదాపు 2 గంటల ప్రయాణం తగ్గుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేవారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం అందనుంది. దీంతో పాటు మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు కూడా ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడదలకు అనుమతి ఇవ్వడంతో టెండర్ల ప్రక్రియ త్వరలో స్టార్ట్ కానుంది. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా.. వారికి పరిహారం అందించనున్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్రంవలో మరికొన్ని రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు షురూ అయ్యాయి. శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఈ రోడ్డు ఉండనుంది. దీంతో శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుందని చెప్పవచ్చు.