ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని చూసి మనమే ఆశ్చర్యపోతాం.. ఉన్నట్లుండి బ్యాంక్ అకౌంట్లో కోట్లు జమ అవుతాయి. ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనకు తెలియవు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలా సార్లు విని ఉండొచ్చు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇటువంటి ఘటనే జరిగింది. గ్రేటర్ నోయిడాలోని డంకౌర్లో మరణించిన ఒక మహిళ ఖాతాలోకి కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ మీకే ఇలా అకౌంట్లో ఉన్నట్టుండి కోట్ల డబ్బు డిపాజిట్ అయితే మీరు ఏం చేస్తారు. ఆ అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ చేస్తారా..? ఒకవేళ మీరు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే.. అలా చేయడం వల్ల మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో పడవచ్చు.. చివరకు జైలుకు కడా వెళ్లాల్సి రావచ్చు.
నేటి డిజిటల్ యుగంలో ప్రతి లావాదేవీ రికార్డ్ అయి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ అకౌంట్లో పడ్డ అమౌంట్ను ఖర్చు చేస్తే దర్యాప్తు సంస్థలు దానిని సులభంగా ట్రాక్ చేయగలవు. అందుకే అలా డబ్బు పడిన వెంటనే ఫిర్యాదు చేయాలి. మీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోని హెల్ప్ విభాగానికి వెళ్లి ఫిర్యాదు చేయండి. మీ ఫిర్యాదులో లావాదేవీ IDని చేర్చడం మర్చిపోవద్దు. లేదా మీరు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.
ఆర్బీఐ పోర్టల్లో ఫిర్యాదు ..
అదే సమయంలో చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని అనుకుంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ https://cms.rbi.org.inకి వెళ్లి “ఫిర్యాదును సమర్పించు”పై క్లిక్ చేసి కంప్లైంట్ను ఫైల్ చేయండి. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత.. మీకు ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దానిని మిస్ చేయకుండా దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఏదైన దర్యాప్తు జరిగనప్పుడు మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది.
పాస్వర్డ్లను మార్చండి
కొన్ని సార్లు డబ్బు జమ చేసి అకౌంట్ను హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో సడెన్గా డబ్బు మీ అకౌంట్లో పడితే.. మీ అన్ని బ్యాంకింగ్ యాప్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యొక్క పాస్వర్డ్లను మార్చండి. దీంతో పాటు టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఫీచర్ను ఆన్ చేయండి.లా చేయడం ద్వారా, మీ ఖాతాలలో దేనినైనా హ్యాక్ చేసే ప్రయత్నం జరిగితే.. అది విఫలమవుతుంది.
సైబర్ క్రైమ్ పోర్టల్లో..
మీ ఖాతా హ్యాక్ అయ్యిందని మీకు డౌట్ వస్తే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయవచ్చు. https://cybercrime.gov.inలో మీ ఫిర్యాదును నివేదించవచ్చు. దీని కోసం, మీరు వెబ్సైట్కి వెళ్లి ‘‘రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్’’ విభాగం కింద మీ కేసును నమోదు చేసుకోవచ్చు. మోసం లేదా మీ సమాచారం దొంగిలించబడిందని మీరు భావిస్తే, మీరు ఆన్లైన్లో FIR లేదా NCRని కూడా దాఖలు చేయవచ్చు.
ఆ ఖాతాలను మూసివేయండి
బ్యాంకులోకి తెలియని మొత్తం వచ్చిన తాజా కేసు మరణించిన మహిళకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో ఓ వ్యక్తి మరణించిన తర్వాత బ్యాంక్ ఖాతా, యూపీఐని వెంటనే క్లోజ్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మరణించిన ఖాతాలను మోసం లేదా హవాలా వంటి తీవ్రమైన నేరాలకు ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో చట్టపరమైన, సైబర్ భద్రతా బెదిరింపులను నివారించడానికి, ఒక వ్యక్తి మరణించిన వెంటనే, వారి బ్యాంక్, యూపీఐ ఖాతాలను మూసివేయండి.
మరిన్ని టెక్వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..