Team India : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్ తర్వాత భారత పేసర్లు తమ అద్బుతమైన బౌలింగుతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కూల్చేశారు. జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతిని అందించినప్పటికీ అతని లేని లోటు ఏమాత్రం కనిపించకుండా భారత బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీంఇండియా బౌలర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. ఆకాష్ దీప్ బౌలింగ్ ప్రారంభించి జాక్ క్రాలీ, ఒలీ పోప్లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడో రోజు సిరాజ్ రంగంలోకి దిగి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను డకౌట్ చేసి భారత్ పట్టును మరింత బిగించాడు. ఈ ముగ్గురు కీలక బ్యాటర్లు డక్ అవుట్ కావడం ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ.
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఇలా పతనం కావడం చాలా అరుదు. వారి టాప్-6 బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఇలా ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో జరగడం 2010 తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా ఈ విధంగా పాకిస్తాన్ పై ఆడిన సమయంలో జరిగింది. ఇప్పుడు టీమిండియా కూడా ఆ అరుదైన రికార్డులో తన పేరును లిఖించుకుంది. ఇది ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఎంతగా తడబడిందో తెలియజేస్తుంది.
జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతిని ఇవ్వడంతో చాలా మంది విమర్శకులు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే, మిగిలిన భారత పేస్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఆ విమర్శలకు తమదైన శైలిలో సమాధానం చెప్పారు. ముఖ్యంగా ఆకాష్ దీప్, సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏమాత్రం కుదరుకోకుండా దెబ్బతీశారు.వారి బౌలింగుతో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టే ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయించింది. అయితే, ప్రస్తుతం భారత్ వైపు మ్యాచ్ మొమెంటం బలంగా ఉంది. ఈ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో విజయం సాధించి, ఆ గెలుపు లేదన్న చరిత్రను తిరిగి రాయడానికి భారత్కు ఈ మ్యాచ్ ఓ సువర్ణావకాశం. ఇక్కడ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. దీంతో లార్డ్స్లో జరిగే చివరి టెస్ట్ సిరీస్ విజేతను నిర్ణయించేది అవుతుంది.
ఈ క్రమంలోనే నేటి మ్యాచులో జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీలు సాధించి ఇంగ్లాండ్కు కాస్త ఊరటనిచ్చారు. వీరిద్దరూ తమ జట్టును 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులకు చేర్చారు. వీరి భాగస్వామ్యం ఇంగ్లాండ్పై ఒత్తిడిని గణనీయంగా తగ్గించింది. అయితే, ఇంగ్లాండ్ ఇంకా మొదటి ఇన్నింగ్స్లో భారత్ కంటే 324 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్ ఇంకా భారత్ చేతుల్లోనే ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి