T20 World Cup: టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా..?

T20 World Cup: టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా..?


India Semi Final Qualification Scenario: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు (Team India) సూపర్-8 దశకు ఘనంగా అర్హత సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగింటిలోనూ గెలిచి భారత్ అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. ఈ ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరే దారి భారత్‌కు సులభంగానే కనిపిస్తోంది. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే జోరు కొనసాగించి ఫైనల్ నాలుగు జట్లలో చోటు దక్కించుకోవడం టీమిండియాకు ప్రధాన లక్ష్యం. మరి సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్ ఎవరెవరితో తలపడాలి? ఎక్కడ, ఎప్పుడు ఈ కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సౌతాఫ్రికాతో తొలి సవాల్..

సూపర్-8 దశలో భారత జట్టు తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో జరగనుంది. ఈ కీలక పోరు ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకే, ఈసారి ప్రోటీస్ జట్టు ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఐదు సార్లు ఎదురెదురుగా నిలిచాయి. ఇందులో మూడు సార్లు భారత్ విజయం సాధించగా, రెండు సార్లు సౌతాఫ్రికా గెలిచింది. ఈసారి ఆ గణాంకాలను సమం చేయగలదా? లేక సూర్యకుమార్ యాదవ్ సేన మరోసారి ఆధిపత్యం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఫిబ్రవరి 26న జింబాబ్వేతో పోరు..

సికందర్ రజా నాయకత్వంలోని అండర్‌డాగ్ జింబాబ్వే ఈ వరల్డ్ కప్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం, చివరి మ్యాచ్‌లో శ్రీలంకను మట్టికరిపించడం ద్వారా సూపర్-8కు అర్హత సాధించింది. జింబాబ్వే సూపర్-8లోకి చేరుతుందని చాలామంది ఊహించలేదు.

ఆ తర్వాత జింబాబ్వేతో ఫిబ్రవరి 26న చెన్నైలో భారత జట్టు తలపడనుంది. భారత్ గడ్డపై సికందర్ రజా సేన అద్భుతం చేయగలదా? లేక టీమిండియా విజయ రథానికి చెన్నైలో బ్రేక్ పడుతుందా అన్నది చూడాలి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

మార్చి 1న వెస్టిండీస్‌తో హై వోల్టేజ్ మ్యాచ్..

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత్‌ను ప్రధాన ఫేవరెట్‌గా భావించారు. కానీ వెస్టిండీస్ ఈ టోర్నీలో చేసిన ధమాకా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రూప్ సీలో నాలుగు మ్యాచ్‌లలో నాలుగింటినీ గెలిచి సూపర్-8కు చేరింది వెస్టిండీస్.

మార్చి 1న భారత్–వెస్టిండీస్ మధ్య జరిగే పోరు సెమీఫైనల్ టికెట్‌కు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ వెస్టిండీస్‌కు ప్రతిష్ఠాత్మక పోరుగా నిలవనుంది. దశాబ్దంగా పెద్ద ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న కరీబియన్ జట్టు, భారత్‌ను ఓడించి తమ సత్తా చాటాలని చూస్తోంది. అయితే టీమిండియా ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

గ్రూప్-ఏలో ఓటమెరుగని జట్లు..

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8కు రెండు గ్రూప్‌లు రూపొందించారు. గ్రూప్-ఏలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉండగా… గ్రూప్-బీలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి.

గ్రూప్-ఏలోని జట్లు గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్‌లో నిలిచాయి. ఇక గ్రూప్-బీలోని జట్లు తమ గ్రూపుల్లో రెండో స్థానాల్లో నిలిచాయి. అందుకే గ్రూప్-ఏను ‘డెత్ గ్రూప్’గా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్‌కు చేరే జట్లు ఎవరో తేలేందుకు ఉత్కంఠ నెలకొంది.

సెమీస్ మ్యాచ్ లు ఎప్పుడంటే?

ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు మొదలయ్యాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 లనుంచి మొత్తం నాలుగు జట్లు సెమీస్ చేరుకుంటాయి. తొలి సెమీస్ బుధవరా, మార్చి 4న జరగనుంది. ఇక రెండో సెమీస్ గురువారం మార్చి 5న జరగనుంది. తొలి సెమీస్ ఎక్కడ జరగనుందో ఇంకా డిసైడ్ చేయలేదు. రెండో సెమీస్ మాత్రం ముంబైలో జరగనుంది. అలాగే, ఫైనల్ కూడా ఇంకా నిర్ణయించలేదు. ఎందుకంటే, పాకిస్తాన్ జట్టు తదుపరి దశకు చేరుకుంటే, మ్యాచ్‌ వేదికలు మారిపోతుంటాయి. ఒక వేళ పాకిస్తాన్ సెమీస్ చేరకుండానే ఇంటికి పోతే, మిగిలిన అన్ని మ్యాచ్‌లు భారతదేశంలోనే జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *