ఆంధ్రదేశంలో వెలసిన శ్రీశైల క్షేత్రం ఒక అద్భుతమైన, శక్తివంతమైన పుణ్యస్థలం. ఇక్కడ శ్రీగిరి కొండపై పరమేశ్వరుడు స్వయంభూ మూర్తిగా కొలువయ్యాడు. భక్తులకు జ్ఞానం, ఐశ్వర్యం, సరస్వతీ కటాక్షం వంటివి కోరకుండానే లభిస్తాయని విశ్వసిస్తారు. శ్రీశైలం అనేక ఉపాసనలకు ఆలవాలంగా నిలిచింది. శంకరాచార్యుల వారు తమ యోగరత్నావళీ స్తవంలో శ్రీశైల ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్షేత్రంలో జపం చేసేవారి మనస్సు తొందరగా లయమవుతుందని చెబుతారు. అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా కాకుండా మెత్తగా తగులుతుందని, భక్తులకు పులకరింతలు కలుగుతాయని నమ్మకం. శ్రీశైల ఆలయ చరిత్ర అత్యంత పురాతనమైనది.. సుదీర్ఘమైనది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలు ప్రాచీనతకు నిదర్శనం. పదకొండవ శతాబ్దంలో చోళులు, పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగుపరచగా, ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1516లో వంద స్తంభాలు కలిగిన మంటపం, తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు రాతిపై చెక్కించిన రచనల ద్వారా తెలుస్తోంది. ఈ గోపురాన్ని గజపతులపై సాధించిన విజయానికి సూచనగా నిర్మించారు. దురదృష్టవశాత్తు, ఈ గోపురం 2010 మే 26న లైలా తుఫాను కారణంగా కూలిపోయింది, పగుళ్ళు ఉన్నప్పటికీ మరమ్మత్తులు జరుగుతూ వచ్చాయి.
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి స్వయంభూవుగా వెలవడానికి సుబ్రహ్మణ్య స్వామి అలిగిన వృత్తాంతం ఒక కారణమని పురాణాలు చెబుతాయి. పరమశివుడు దూరమైన వారిని వెతుక్కుంటూ వచ్చి శ్రీశైలంలో కొలువుదీరాడు. అందుకే శ్రీశైలంలో ధూళి దర్శనం అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి, ఎలాంటి సంప్రదాయ శౌచాన్ని పాటించకుండా, సహజ స్థితిలో వచ్చి స్వామిని దర్శించుకుంటే ఆయన ఆనందపడతాడని, సర్వకామ్య సిద్ధులు ప్రసాదిస్తాడని ప్రతీతి. ఇది తండ్రి తన బిడ్డను ప్రేమతో అక్కున చేర్చుకున్నట్లే. శ్రీశైలంలో వెలసిన పరమాత్మ ఒకరి ప్రార్థన చేత కాకుండా తనంతట తానుగా తల్లిదండ్రిగా వెలిశాడు. అందుకే సాక్షి గణపతి వద్ద భక్తులు తమ గోత్ర నామాలు చెప్పి నమోదు చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ వివరాలు చిత్రగుప్తుడి దస్త్రాల్లో కాకుండా సాక్షి గణపతి స్వయంగా నమోదు చేసుకుంటాడని నమ్ముతారు.
శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని ఎందుకు పిలుస్తారంటే..?
శ్రీశైలంలో మరో విశేషం చెవిటి మల్లన్నగా స్వామిని పిలవడం. అమాయక భక్తుడు తన విన్నపం ఒకటికి.. రెండు సార్లు చెప్పాక.. ఆయన విన్నాడో లేదో అని సందేహంతో చెవిటి మల్లన్నోయ్ విన్నావా? అని పిలిచినప్పుడు, స్వామి ప్రేమతో పొంగిపోయాడని, అప్పటినుంచి ఆయనకు ఆ పేరు స్థిరపడిందని కథనం. ఇక్కడ శిఖరేశ్వరం వద్ద ఉన్న నంది శృంగములలోంచి శ్రీశైల శిఖరాన్ని ధ్యానంతో దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు. శివుడు, పార్వతి ఒకసారి వృద్ధ బ్రాహ్మణల రూపంలో వచ్చి, పాపం లేనివారు మాత్రమే తన భర్తను ఊబి నుంచి రక్షించమని అడగగా, ఒక వేశ్య మాత్రమే శ్రీశైల శిఖర దర్శనంతో తన పాప పుణ్యాలు సున్నా అయ్యాయని చెప్పి, భర్తను రక్షించి మోక్షం పొందిన వృత్తాంతం భక్తులలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. హాటకేశ్వరంలో ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగం తనంతట తాను ఆవిర్భవించింది. ఇక్కడ పాలధారలు, పంచధారలు ప్రవహిస్తాయి. వీటిని కేవలం నీళ్లుగా కాకుండా, శివుని లలాటం నుంచి జ్ఞానాగ్ని ద్వారా ప్రవహించే పవిత్ర జలంగా భావించి స్వీకరిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీశైల క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాకుండా, విశ్వాసం, ప్రేమ, చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాల సమ్మేళనంగా విరాజిల్లుతోంది.
Also Read: Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి