ఈ క్రమంలో మనిషి మనిషితో మాట్లాడటం మానేసి, యంత్రాలతో సంభాషిస్తున్నాడు. ముఖ్యంగా ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ అనే కొత్త అలవాటు మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఈ టెక్నాలజీ మాయలో మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకుందాం..
టీవీ నుండి సెల్ ఫోన్ వరకు..
టీవీ రావడంతో రేడియో కాలం ముగిసింది. దశాబ్దాల పాటు టీవీ మన జీవితాల్లో కీలక భాగమైపోయింది. అయితే ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల రాకతో టీవీ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మనిషికి ఏ సమస్య వచ్చినా మొదట గూగుల్ను సంప్రదిస్తున్నాడు. అప్పటికి సమస్య తీరకపోతేనే నిపుణుల వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధాలు కేవలం అవసరం ఉంటేనే అన్నట్లుగా మారిపోయాయి.
టీవీ, సెల్ ఫోన్.. ఇవి రెండూ ఇప్పుడు మన కళ్లకు అతుక్కుపోయాయి. టీవీ చూస్తూనే పక్కన మొబైల్ స్క్రోల్ చేయడాన్ని నిపుణులు ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ అని పిలుస్తున్నారు. ఇందులో మనిషి రెండింటిపై సమానంగా శ్రద్ధ పెట్టలేక ఏకాగ్రత కోల్పోతున్నాడు. టీవీ అనేది కేవలం బ్యాగ్రౌండ్ నాయిస్గా మారిపోయింది. సెల్ ఫోన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాచారం లభిస్తుండటంతో, టీవీ కోసం వేచి చూసే ఓపిక మనిషిలో చచ్చిపోయింది.
దెబ్బతింటున్న ఏకాగ్రత..
ఒకే సమయంలో రెండు స్క్రీన్ల మీద దృష్టి పెట్టడం వల్ల మన మెదడు ఏ పనీ సరిగ్గా చేయలేకపోతోంది. దీనివల్ల ఏకాగ్రత లోపిస్తోంది. కేవలం టీవీ చూసేటప్పుడే కాదు, ఏ పని చేస్తున్నా సెల్ ఫోన్ పక్కన ఉండటం వల్ల దృష్టి మళ్లుతోంది. భవిష్యత్తులో ఇది తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి కానీ, అది మనల్ని నియంత్రించకూడదు. టెక్నాలజీ ఇచ్చే సౌకర్యం బాగుంటుంది కానీ, అది మనిషిలోని సహజత్వాన్ని చంపేస్తోంది. సెల్ ఫోన్ లో మునిగిపోయి పక్కన ఉన్న వారితో మాట్లాడటం మర్చిపోతే, చివరకు ఒంటరితనం మిగులుతుంది. ఇప్పటికైనా ‘స్క్రీన్ టైమ్’ తగ్గించి, నిజమైన ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉంది.