సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రమ్యకృష్ణకు ఆశీర్వచనం అందించారు. అలాగే ఆమెకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. అదే సమయంలో రమ్యకృష్ణతో ఫోటోస్ దిగేందుకు అక్కడున్న భక్తులు ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్న రమ్యకృష్ణ.. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా చక్రం తిప్పిన రమ్యకృష్ణ.. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. తల్లిగా, వదినగా, అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.