బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటితోపాటు.. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ జారీ చేసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక.. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ నదిసంద్రంగా మారింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుని వాహనదారులు నరకం చూశారు. అటు.. రాజమండ్రిలోనూ భారీ వర్షం కురిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..