Puri Rath Yatra Stampede: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్రగాయాలు..

Puri Rath Yatra Stampede: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్రగాయాలు..


పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. 20 మందికిపైగా గాయాలయ్యాయి.. పూరీలోని గుండిచా ఆలయం సమీపంలోని శారదాబలి వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.. తొక్కిసలాటలో కనీసం ముగ్గురు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం, జగన్నాథుని రథం ‘నంది ఘోష్’ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున 4 – 5 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగింది. బలభద్రుడు, దేవత సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు ఆలయం సమీపంలోకి చేరుకోగానే, పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. జనసమూహాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లు అకస్మాత్తుగా పడిపోయాయి.. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళంలో, కొంతమంది భక్తులు రథ చక్రాల దగ్గర పడిపోయారు, దీని కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్నారు.

మృతులు ఒడిశాలోని ఖోర్ధా జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. మృతులను ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు తెలిపారు. రథంపై ఉన్న స్వామివార్లను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని.. వెంటనే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

రథయాత్ర ముగిసిన ఒక రోజు తర్వాత, శనివారం జగన్నాథ ఆలయం నుండి రథాలు శారదా బలి వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రాంతంలోకి చెక్క దుంగలను తీసుకెళ్లే రెండు ట్రక్కులు ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి.. తొక్కిసలాటకు దారి తీసిందని.. ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.. ఈ ఘటనపై ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపాన్ని వ్యక్తం చేయడంతోపాటు.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *