ప్రపంచ సాంకేతిక యవనికపై భారతదేశం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎక్స్పోను సందర్శించి, భారతీయ స్టార్టప్లు, పరిశోధకులు రూపొందించిన వినూత్న AI ఆవిష్కరణలను స్వయంగా పరిశీలించారు. ‘‘ఏఐ కేవలం సాంకేతికత మాత్రమే కాదు.. అది మానవ పురోగతికి ఒక బాధ్యతాయుతమైన సాధనం కావాలి. భారతీయ ప్రతిభ ప్రపంచ శ్రేయస్సు కోసం సరికొత్త భవిష్యత్తును రూపొందిస్తుంది అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ AI సమ్మిట్ ఇదే కావడం విశేషం. కేవలం దౌత్యపరమైన విజయం మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు రంగంలో భారత్ ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగిందని ఈ ఎక్స్పో చాటిచెబుతోంది.
ఎక్స్పో విశేషాలు ఒక చూపులో
70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 10 భారీ అరీనాలలో ఈ ప్రదర్శన జరుగుతోంది. రష్యా, జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా 13 దేశాల ప్రత్యేక పెవిలియన్లు ఇక్కడ కొలువుదీరాయి. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు థీమ్స్ ఆధారంగా 300కు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 600కు పైగా హై-పొటెన్షియల్ స్టార్టప్లు తమ AI పరిష్కారాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నాయి.
ఇండియా ఏఐ మిషన్: స్వదేశీ శక్తి చాటుతూ..
ఈ సమ్మిట్ సందర్భంగా భారత్ తన మేధోశక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. IndiaAI మిషన్ కింద, భారతీయ డేటాసెట్లపై శిక్షణ పొందిన 12 స్వదేశీ ఫౌండేషన్ మోడల్స్ను ఆవిష్కరించారు. ఇవి భారతదేశంలోని 22 అధికారిక భాషలకు అనుగుణంగా పని చేయడం విశేషం.
2027 నాటికి 17 బిలియన్ డాలర్ల మార్కెట్
800 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు, పటిష్టమైన డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో, దేశ AI మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా. ఈ ఎక్స్పో ద్వారా సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు, వేల సంఖ్యలో అంతర్జాతీయ ప్రతినిధులు సరికొత్త వ్యాపార అవకాశాలను అందుకోనున్నారు.
India AI Impact Expo 2026 was a powerful convergence of ideas, innovation and intent.
It showcased the extraordinary potential of Indian talent in shaping the future of Artificial Intelligence for global good.
Above all, it reaffirmed our commitment to harnessing AI… pic.twitter.com/jfVWCP4BHh
— Narendra Modi (@narendramodi) February 17, 2026