మన శరీరంలోని అంతర్గత అవయవాలు 24 గంటలూ పనిచేస్తున్నప్పటికీ, ప్రతి అవయవం ఒక నిర్దిష్ట రెండు గంటల సమయంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. దీనినే ‘ఆర్గాన్ క్లాక్’ లేదా ‘అవయవ గడియారం’ అంటారు. ఈ సమయంలో ఆయా అవయవాలకు ప్రాణశక్తి ఎక్కువగా అందుతుంది. ఏ సమయంలో ఏ అవయవం చురుగ్గా ఉంటుందో, ఆ సమయంలో మనం ఎలా ఉండాలో తెలిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు.
తెల్లవారుజామున ఊపిరితిత్తుల డ్యూటీ!
సూర్యచంద్రుల కదలికలపై ఆధారపడిన భారతీయ సిద్ధుల లెక్కల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఈ సమయంలో మన ఊపిరితిత్తులలో ప్రాణశక్తి ప్రవాహం చాలా చురుగ్గా ఉంటుంది. అందుకే ఈ సమయంలో లేచి ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత ఉదయం 5 నుండి 7 గంటల వరకు పెద్దప్రేగు చురుగ్గా ఉంటుంది, ఇది శరీర విసర్జనకు సరైన సమయం.
ఆహారం ఎప్పుడు తీసుకోవాలి?
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మన జఠరాగ్ని అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అల్పాహారం తీసుకోవడానికి ఇది అత్యంత అనుకూల సమయం. ఆ తర్వాత 9 నుండి 11 గంటల వరకు ప్లీహం చురుగ్గా ఉండి, మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. మధ్యాహ్నం 11 నుండి 1 గంట వరకు గుండె తన పనిని వేగవంతం చేస్తుంది, ఈ సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం మంచిది.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బాడీ టైమ్ టేబుల్!
మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు చిన్నప్రేగు పోషకాలను గ్రహిస్తుంది. సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు మూత్రాశయం, 5 నుండి 7 గంటల వరకు మూత్రపిండాలు (Kidneys) శరీరాన్ని శుద్ధి చేసే పనిలో ఉంటాయి. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు పెరికార్డియం చురుగ్గా ఉంటుంది, ఇది మానసిక ప్రశాంతతకు అవసరమైన సమయం. రాత్రి 9 నుండి 11 గంటల వరకు ఎండోక్రిన్ వ్యవస్థ తన పనిని పూర్తి చేస్తుంది.
నిద్ర ఎందుకు ముఖ్యం?
అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట వరకు పిత్తాశయం, 1 నుండి 3 గంటల వరకు కాలేయం (Liver) రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ సమయంలో గాఢ నిద్రలో ఉండటం చాలా ముఖ్యం. ఎవరైతే ఈ సమయంలో మేల్కొని ఉంటారో, వారికి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఈ జీవ గడియారం మనకు సందేశం ఇస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాణశక్తి మార్గాలను అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.