MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోని, తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కార్చిచ్చు రేపాయి. 2027 వన్డే ప్రపంచకప్లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకున్న తరుణంలో ధోని వారికి మద్దతుగా నిలిచారు. అయితే, ధోని మద్దతు పలకడం కొందరికి నచ్చితే, మరికొందరు మాత్రం పాత విషయాలను తవ్వి తీస్తూ ధోనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వయసు 38-39 ఏళ్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో వారు జట్టులో ఉండాలా? వద్దా? అనే దానిపై ధోని స్పందిస్తూ.. “వయసు అనేది కేవలం అంకె మాత్రమే. ఫిట్నెస్, ఫామ్ ఉంటే ఎవరైనా ఆడవచ్చు. విరాట్, రోహిత్ ఇప్పటికీ కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా రాణిస్తున్నారు. పెద్ద టోర్నీల్లో ఎప్పుడూ అనుభవానికి విలువ ఉంటుంది. కాబట్టి వారు 2027 వరల్డ్ కప్ ఆడటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని తేల్చి చెప్పారు.
ధోనిపై నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే?
ధోని వ్యాఖ్యలు విన్న నెటిజన్లు కొందరు గత చరిత్రను గుర్తు చేస్తున్నారు. ధోని కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఫిట్నెస్ సాకుతో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను రొటేషన్ పాలసీ పేరుతో పక్కన పెట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. “నాడు సీనియర్ల వల్ల ఫీల్డింగ్ స్లో అవుతోందని చెప్పిన ధోని.. ఇప్పుడు రోహిత్, విరాట్ విషయంలో వయసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యువీ, భజ్జీ వంటి ఆటగాళ్లను చివరి దశలో ధోని బ్యాక్ చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
టీమిండియాకు మంచు ముప్పు
కేవలం ప్లేయర్ల గురించే కాకుండా, రాబోయే టీ20 ప్రపంచకప్లో భారత్కు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటో కూడా ధోని వివరించారు. భారత్ దగ్గర ఛాంపియన్గా నిలిచే అన్ని శక్తులు ఉన్నాయని, అయితే టాస్, మంచు ఫ్యాక్టర్ మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయగలవని ఆయన హెచ్చరించారు. రెండో ఇన్నింగ్స్లో బంతిపై పట్టు చిక్కడం కష్టమవుతుందని, ఆ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉందని ధోని విశ్లేషించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి