MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక ధ్రువతార. కెప్టెన్గా ఆయన సాధించిన విజయాలు, అందించిన ఐసీసీ ట్రోఫీలు మరే ఇతర భారతీయ సారథికీ సాధ్యం కాలేదు. అయితే 2017లో ధోనీ అకస్మాత్తుగా వన్డే, టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పుడు అభిమానులంతా షాక్కు గురయ్యారు. ఇప్పటివరకు ఆ నిర్ణయం ధోనీ సొంతంగా తీసుకున్నారని అందరూ భావించారు. కానీ దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడ్డాయి. ధోనీ తనంతట తానుగా తప్పుకోలేదని, సెలెక్టర్లే ఆయనను గౌరవపూర్వకగా పక్కకు తప్పుకోవాలని కోరారని మాజీ నేషనల్ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే సంచలన విషయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్కు నాయకత్వ బాధ్యతలు మారిన ప్రస్తుత తరుణంలో, ధోనీ-కోహ్లీ మధ్య జరిగిన ఆ అధికార మార్పిడికి సంబంధించిన రహస్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాడు ఏం జరిగిందో వివరిస్తూ జతిన్ పరాంజ్పే కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. 2017 జనవరిలో నాగ్పూర్లో జరిగిన ఒక డొమెస్టిక్ మ్యాచ్ సమయంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, జతిన్ పరాంజ్పే కలిసి ధోనీని కలవాలని నిర్ణయించుకున్నారు. కోహ్లీని పరిమిత ఓవర్ల కెప్టెన్గా సిద్ధం చేయాలంటే ధోనీ తప్పుకోవడం అవసరమని బోర్డు భావించింది. అయితే, భారతదేశపు అత్యంత విజయవంతమైన కెప్టెన్కు ఈ విషయం ఎలా చెప్పాలన్న దానిపై సెలెక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ధోనీ ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని వచ్చే వరకు వారు స్టేడియంలో వేచి చూశారు. ధోనీ దాదాపు గంటసేపు నెట్స్లో తీవ్రంగా శ్రమించిన తర్వాత, అతడి దగ్గరకు వెళ్లి చాలా మర్యాదపూర్వకంగా మహీ, కోహ్లీ కోసం బాధ్యతలు వదిలేయడానికి ఇదే సరైన సమయమని మేము అనుకుంటున్నాం అని చెప్పారు.
సాధారణంగా ఏ కెప్టెన్ అయినా ఇలాంటి సమయంలో అసహనం వ్యక్తం చేయడం లేదా వాదించడం చేస్తారు. కానీ ధోనీ మాత్రం ఎంతో హుందాగా స్పందించారు. ఎంఎస్కే ప్రసాద్ను అన్న అని పిలుస్తూ.. మీరు చెప్పింది నిజమే, సమయం ఆసన్నమైంది. నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి అని బదులిచ్చారు. ఆ క్షణంలో ధోనీ చూపిన పరిణతి చూసి సెలెక్టర్లు విస్తుపోయారు. ప్రజల్లో ఎలాంటి అపోహలు రాకూడదనే ఉద్దేశంతో, ధోనీని స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ఒక ఇమెయిల్ పంపమని సెలెక్టర్లు కోరారు. అదే రోజు రాత్రి ధోనీ నుంచి బోర్డుకు ఒక చిన్న ఈమెయిల్ అందింది. అందులో నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని క్లుప్తంగా ఉంది. ఆ నిర్ణయం వెనుక సెలెక్టర్ల ఒత్తిడి ఉందని అప్పట్లో ఎవరికీ తెలియదు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, విరాట్ కోహ్లీకి పూర్తి మద్దతు ఇస్తానని ధోనీ సెలెక్టర్లకు మాట ఇచ్చారు. విరాట్ నాకు తమ్ముడు లాంటి వాడు. అతడి ఎదుగుదలకు, టీమ్ విజయాలకు నేను వికెట్ల వెనుక నుంచి పూర్తి సహకారం అందిస్తాను అని ధోనీ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2017 నుంచి 2019 వరల్డ్ కప్ వరకు ధోనీ ఒక మెంటార్లా కోహ్లీకి అండగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలర్లకు సలహాలు ఇవ్వడం వంటివి ధోనీనే చూసుకునేవారు. ఈ స్మూత్ ట్రాన్సిషన్ వల్లే కోహ్లీ కెప్టెన్గా విజయవంతం కాగలిగారు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించినా, ఆయన వదిలివెళ్లిన వారసత్వం ఇప్పటికీ భారత క్రికెట్ను నడిపిస్తోంది. బోర్డు ఒత్తిడి చేసినా ధోనీ దానిని వివాదం చేయకుండా దేశ హితం కోరి తప్పుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి