తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో 48 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 37 డివిజన్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 8, బీజేపీ 3 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు ఒక డివిజన్ను సొంతం చేసుకున్నారు.
మరో మూడు కార్పొరేషన్లలో ఇలా..
నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లలో 45 డివిజన్ల ఫలితాలు వెలువగా.. కాంగ్రెస్ 26 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 4 స్థానాలకు పరిమితమయ్యింది. 7 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.
మహబూబ్నగర్లోని 60 డివిజన్లలో 22 డివిజన్ల ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ తలా 4 డివిజన్లు సొంతం చేసుకున్నాయి. ఇతరులు 2 డివిజన్లు సాధించారు.
రామగుండంలోని మొత్తం 60 డివిజన్లలో 53 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 35 చోట్ల గెలుపొంది స్పష్టమైన మెజార్టీని సాధించింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాలు సొంతం చేసుకున్నారు.