Maha shivaratri Story: శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..? పార్వతికి శివుడు ఏం చెప్పాడో తెలుసా..?

Maha shivaratri Story: శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..?  పార్వతికి శివుడు ఏం చెప్పాడో తెలుసా..?


Maha shivaratri Story: శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..?  పార్వతికి శివుడు ఏం చెప్పాడో తెలుసా..?

మహాశివరాత్రి మన హిందువులకు పరమ పవిత్రమైన పండగ. ఈ రోజు ప్రతి హిందూ భక్తుడు నిష్ఠగా ఉపవాసాలు, జాగరణలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు చేస్తారు. అసలు శివరాత్రి రోజు ఈ పవిత్ర ఆచారాలను ఎందుకు పాటించాలి? దీని వెనుక ఉన్న కారణాలను స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది: “నాధా, మనుషులు చేసే అనేక పాపాల వలన మరల మరల జన్మిస్తున్నారు. వారు గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుని, పుణ్యమార్గంలో జీవించి, కైలాసానికి చేరుకునేలా ఏదైనా సులభమైన మార్గం చెప్పండి.” అప్పుడు పరమేశ్వరుడు, “సరే, చెబుతాను విను. ఇది ఒక మహాశివరాత్రి కథ” అని చెప్పడం ప్రారంభించారు.

బోయవాడి కథ..

పూర్వకాలంలో ఒక అరణ్య ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు వేటాడుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక రోజు వేటకు వెళ్లిన అతడికి చీకటి పడే సమయానికి కూడా ఒక్క జంతువు కూడా దొరకలేదు. నిరాశగా తిరిగి వస్తుండగా, అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తుందేమో అని ఆశించి, సరస్సు పక్కన ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పటికే రాత్రి కావడంతో బోయవాడికి నిద్ర వస్తూ ఉంది. నిద్ర నుంచి మేలుకొని ఉండటానికి, అతడు చెట్టు మీద ఉన్న ఒక్కొక్క ఆకును తెంపి కింద పడవేయడం మొదలుపెట్టాడు. శివ శివ అనడం అతడికి అలవాటు. అలా శివ నామస్మరణ చేస్తూ ఆకులను కింద పడేస్తూ ఉన్నాడు.

బోయవాడిలో మార్పు..

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. బోయవాడు బాణం ఎక్కుపెట్టగా, ఆ జింక తాను గర్భవతినని, తనను చంపడం అధర్మమని, వదిలిపెట్టమని వేడుకుంది. దాని మాటలు విని బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేశాడు. అలా తర్వాత వచ్చిన మరో ఆడ జింక, ఒక మగ జింక, చివరికి మరో జింక దాని పిల్ల కూడా తమ సత్యనిష్ఠతో మానవ భాషలో మాట్లాడి.. తిరిగి వస్తామని మాట ఇచ్చి వెళ్లిపోయాయి. బోయవాడు ఆశ్చర్యంగా ఆ జింకల కోసం వేచి ఉన్నాడు. సూర్యోదయం సమయానికి, ఆ జింకలన్నీ తమ మాట ప్రకారం బోయవాడి వద్దకు తిరిగి వచ్చి, ముందుగా తమను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. అతడు వేటను విడిచిపెట్టి, సన్మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

మోక్షం.. కైలాసం ఆహ్వానం

అదే సమయంలో దైవదూతలు అక్కడకు వచ్చి, బోయవాడిని కైలాసానికి ఆహ్వానించారు. తను శివుడిని పూజించడం తనకు తెలియదని చెప్పగా.. దేవదూతలు ఇలా వివరించారు: “ఈరోజు మహాశివరాత్రి. నీకు తెలియకుండానే పొద్దుటి నుంచి ఉపవాసం చేశావు.. రాత్రంతా జాగరణ చేశావు, శివ నామస్మరణ చేశావు. నీవు చెట్టు ఎక్కుతుండగా నీ మొలకు కట్టుకున్న నీళ్లు తెగి, కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. నీవు తెంపిన ఆకులు బిల్వాకులై శివుడికి బిల్వార్చనగా మారాయి. ఈరోజు శివరాత్రి కావడంతో నీకు శివుడి అనుగ్రహం లభించింది.” ఈ కథను చెప్పి, శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం, బిల్వార్చనలు, శివ నామస్మరణ, రుద్రాభిషేకం చేసేవారి పాపాలు ప్రక్షాళనమై, మోక్షానికి చేరువవుతారని శివుడు పార్వతికి వివరించారు.

శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..?

అంతేకాకుండా, శివరాత్రి ఆరోజునే ఎందుకు జరుపుకుంటాం, శివుడికి ఈ రోజు అంటే ఎందుకు అంత ప్రీతికరమైనది అనేదానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి:
1. ‘శివలింగ ఆవిర్భావం’: బ్రహ్మ, విష్ణువు తమలో తాము గొప్పవారమని గొడవ పడుతుండగా.. వారి మధ్యలో శివుడు ఒక పెద్ద ఆది అంతం లేని అగ్ని శివలింగంగా ఆవిర్భవించిన రోజు శివరాత్రి.
2. ‘శివపార్వతుల వివాహం’: శివుడు, పార్వతీదేవిల వివాహం జరిగిన రాత్రి శివరాత్రి.
3. ‘తాండవ నృత్యం’: శివుడు ఆనందంగా తాండవ నృత్యం చేసే రోజు శివరాత్రి.
4. ‘కాలకూట విషం స్వీకరణ’: క్షీరసాగర మదనం సమయంలో కాలకూట విషం పుట్టినప్పుడు, ప్రపంచాన్ని కాపాడటానికి శివుడు ఆ విషాన్ని తాగి కంఠంలో దాచుకొని నీలకంఠుడు అనే పేరు పొందిన రాత్రి శివరాత్రి.

ఈ అన్ని కారణాల వల్ల శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ఈరోజు భక్తి నిష్ఠలతో పూజలు చేసేవారు శివుడికి అత్యంత సన్నిహితులు అవుతారని స్వయంగా శివుడే చెప్పారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *