నేటి అనిశ్చిత కాలంలో కుటుంబ ఆర్థిక భద్రత అనేది అత్యంత కీలకం. అధిక ప్రీమియంలు చెల్లించలేక బీమాకు దూరంగా ఉంటున్న సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అతి తక్కువ మొత్తంతోనే భారీ బీమా ప్రయోజనాన్ని పొందే అవకాశం కలుగుతుంది.
ఏ కారణంతో మరణించినా బీమా వర్తింపు!
ఈ పథకంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యం, ఆత్మహత్య వంటి ఏ ఇతర కారణాల వల్ల మరణించినా నామినీకి రూ.2 లక్షల బీమా మొత్తం అందుతుంది. ఇది ఒక ‘ప్యూర్ టర్మ్’ పాలసీ, అంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు కానీ మరణానంతరం కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసా లభిస్తుంది.
ఎవరు అర్హులు?
వయసు: 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న భారతీయ పౌరులందరూ ఈ స్కీమ్లో చేరవచ్చు.
ఖాతా: ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.
లింకేజీ: ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
పరిమితి: ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లు ఉన్నా, కేవలం ఒక బ్యాంకు ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది.
ప్రీమియం వివరాలు ఇలా..
ఈ పథకానికి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. అంటే నెలకు సగటున రూ.36 మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి ఏటా మే 25 నుంచి 31 మధ్య మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో-డెబిట్ పద్ధతిలో ఈ మొత్తం కట్ అవుతుంది. మీరు పథకంలో చేరే నెలను బట్టి మొదటి ఏడాది ప్రీమియం మారుతూ ఉంటుంది. 55 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ బీమా కవరేజీని కొనసాగించవచ్చు.
క్లెయిమ్ ఎప్పుడు చేసుకోవచ్చు?
కొత్తగా ఈ పథకంలో చేరిన వారు నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాతే (లీన్ పీరియడ్) సాధారణ మరణాలకు క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. అయితే, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మాత్రం వెంటనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
మీకు ఖాతా ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసును సంప్రదించి ఒక చిన్న ఫారమ్ నింపడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్న వారు కూడా విడివిడిగా ప్రీమియం చెల్లించి ఈ లబ్ధి పొందవచ్చు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు. పూర్తి వివరాల కోసం మీ బ్యాంకును సంప్రదించండి.