సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం( జులై 03)న సోమాజీగూడలోని యశోద హాస్పిటల్లో అడ్మిటయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కలిసి పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు హాస్పిటల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారితో ఆయన చర్చించారు. రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై పార్టీ నేతలు, ఉద్యమకారులతో నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలకు కేసీఆర్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
వీడియో చూడండి..
అయితే గత రెండ్రోజులుగా నీరసంగా ఉండడంతో తన వ్యక్తిగత వైద్యుడి సలహామేరకు మాజీ సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్కు వచ్చారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గురువారం రాత్రి 9.30 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నీరసంగా ఉండడంతో కేసీఆర్ హాస్పిటల్కు వచ్చారని.. ప్రస్తుతతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.