న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 12 మంది వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో రాజస్థాన్కి చెందిన కబీర్ చిల్లర్ (17) టాప్ స్కోర్ సాధించాడు. జేఈఈ మెయిన్ తొలి విడతలో 300కు 300 స్కోర్ సాధించి అందరినీ అబ్బురపరిచాడు. కబీర్ తండ్రి మొహిత్ చిల్లర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఐఐటీ జాబ్ చేస్తున్నారు. తల్లి ప్రియాంక చిల్లర్ ప్రైవేట్ టీచర్. కబీర్కి 10వ తరగతిలో 98 శాతం స్కోర్ వచ్చింది. తాజాగా జేఈఈ మెయిన్లో టాప్ స్కోర్ సాధించడంపై కబీర్ మీడియాతో మాట్లాడుతూ.. సరైన గైడెన్స్ తన విజయానికి తొలి మెట్టని అంటున్నాడు. అలాగే సరైన డైరెక్షన్లో హార్ట్ వర్క్ చేయడం కూడా చాలా ముఖ్యమని అన్నాడు. గంటల తరబడి చదివినంత మాత్రాన సరిపోదు. ఏం చదువుతున్నావు? ఎందుకు చదువుతున్నావు? అనే విషయాలు అర్ధం చేసుకోగలగాలి. కోటాలో కోచింగ్ తీసుకోవడం తనకు బాగా ఉపయోగపడిందన్నాడు. సబ్జెక్టు లోతుగా నేర్చుకోవడానికి ఇక్కడి కోచింగ్ ఉపయోగపడిందని అన్నాడు.
జేఈఈలో మంచి స్కోర్ కొట్టాలంటేఎలా సన్నద్ధమవ్వాలంటే.. కబీర్ సూచనలు
జేఈఈ ప్రిపరేషన్ 2 ఏళ్లుగా చేస్తున్నాను. ప్రతి సబ్జెక్టును చిన్న చిన్న టాపిక్లుగా విడగొట్టి, ప్రతి విభాగాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం వల్ల పట్టు సాధించగలం. మాక్ టెస్ట్లు, వివరణాత్మక విశ్లేషనలు.. పరీక్షల్లో చేసిన తప్పుల నుంచి నిరుత్సాహపడకుండా వాటిని మెరుగుపరచుకుని నేర్చుకోవాలి. ప్రతి టెస్ట్ తర్వాత ఎక్కడ తప్పు చేశాం, ఎందులో వెనకబడి ఉన్నాం అనే విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఇది ప్రిపరేషన్ను మెరుగుపరుస్తుంది. మాక్ టెస్ట్లు రాయడం వల్ల పరీక్ష సమయంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది.
స్ట్రెస్ మెనేజ్మెంట్ కోసం స్నేహితులతో కలిసి బయటకు వెళ్తాను. ఇది నన్ను రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. కఠినమైన సన్నాహక దశలో మానసిక శ్రేయస్సు చాలా ముఖ్యం. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడం తన లక్ష్యమని, కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఒకటైన జేఈఈ మెయిన్లో 300కి 300 స్కోర్ కొట్టిన కబీర్ చిల్లర్ ప్రిపరేషన్ జర్నీ విద్యార్ధులకు మార్గదర్శకత్వం అవుతుందనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.