
రైలు ప్రయాణికులు తరచుగా ఫిర్యాదు చేసే అంశాల్లో అపరిశుభ్రత ఒకటి. రైలు టాయిలెట్లు కంపుకొడుతూ ఉంటాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ సమస్యను సమర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభించింది.
చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ లక్ష్మణ్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రైళ్లలో శుభ్రపరిచే పనులను ఇప్పుడు AI సాంకేతికత పర్యవేక్షిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్గా దేశవ్యాప్తంగా 100 రైళ్లలో ఈ వ్యవస్థ ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లలో కనిపించే స్థాయి శుభ్రతను ఇప్పుడు జనరల్ క్లాస్ కోచ్లలో కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ AI ఆధారిత వ్యవస్థ ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. శుభ్రపరిచే సిబ్బంది రైలు ఎక్కిన వెంటనే యాప్లో తమ ఫోటోను అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయాలి. టాయిలెట్ శుభ్రపరిచే ముందు ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. శుభ్రపరిచే పని పూర్తయ్యాక మరో ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ఫొటోలను AI వ్యవస్థ విశ్లేషించి, నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం శుభ్రత జరిగిందో లేదో అంచనా వేస్తుంది. ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరగకపోతే సంబంధిత సిబ్బందికి హెచ్చరికలు జారీ చేయడం, తీవ్రమైన సందర్భాల్లో జరిమానాలు విధించడం వంటి చర్యలకు కూడా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా అన్ని తరగతుల కోచ్లలో సమాన స్థాయి పరిశుభ్రతను తీసుకురావడం, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు దోహద పడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి