IND vs PAK : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అటు మైదానంలో ఆటగాళ్ల మధ్య, ఇటు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్ధం నడుస్తుంది. కానీ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామా మునుపెన్నడూ చూడనిది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన బాయ్కాట్ రాజకీయాలు, వేదిక మార్పు వివాదాల మధ్య ఎట్టకేలకు ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఇన్ని గొడవల మధ్య జరిగిన ఈ పోరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కంటే ఎక్కువ మంది ఈ మ్యాచ్ను చూడటం విశేషం.
ఈ మెగా టోర్నీ అధికారిక డిజిటల్, బ్రాడ్కాస్టింగ్ భాగస్వామి జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఆన్లైన్ స్ట్రీమింగ్లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికం. ఈ లెక్కల్లో కేవలం మొబైల్ లేదా ల్యాప్టాప్లో చూసిన వారు మాత్రమే ఉన్నారు. ఒకవేళ టీవీల్లో చూసిన వారి సంఖ్యను కూడా కలిపితే ఈ రికార్డు ఊహకందని స్థాయిలో ఉండేది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యూయర్షిప్ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ (భారత్ vs సౌతాఫ్రికా) కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా గత వరల్డ్ కప్లో జరిగిన భారత్-పాక్ గ్రూప్ మ్యాచ్తో పోలిస్తే ఈసారి వ్యూస్ ఏకంగా 56 శాతం పెరిగాయి. వ్యూయర్షిప్లో టీమ్ ఇండియా ఎలాగైతే డామినేట్ చేసిందో, మైదానంలో కూడా పాకిస్థాన్ను అదే రేంజ్లో ఉతికి ఆరేసింది. ఒకవైపు పాక్ ప్లేయర్స్ షేక్హ్యాండ్ ఇవ్వకుండా మొండికేసినా, మనోళ్లు మాత్రం బ్యాట్తో సమాధానం చెప్పి 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు.
అయితే ఈ రేంజ్లో వ్యూస్ పెరగడానికి కేవలం క్రికెట్ మీద ఉన్న పిచ్చి మాత్రమే కారణం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్కు ముందు పాకిస్థాన్ చేసిన బాయ్కాట్ డ్రామా ఈ మ్యాచ్పై విపరీతమైన హైప్ను క్రియేట్ చేసింది. మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచాయి. మొత్తానికి పాక్ ఆడిన రాజకీయ క్రీడ బ్రాడ్కాస్టర్లకు కాసుల వర్షం కురిపించగా, పాక్ జట్టుకు మాత్రం ఘోర పరాజయాన్ని మిగిల్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..