IND vs PAK : భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలోనే కాకుండా, మైదానం బయట కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తొలగించడంపై నిరసనగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామని హెచ్చరించినప్పటికీ, చివరి నిమిషంలో ఐసీసీతో జరిపిన చర్చల తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐసీసీ ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా మేజర్ టోర్నమెంట్లలో ప్రత్యర్థి జట్ల ప్రాక్టీస్ సెషన్లు కొన్నిసార్లు ఒకే సమయంలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. అయితే భారత్-పాక్ మధ్య ఉన్న ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా, రెండు జట్లూ వేర్వేరు సమయాల్లో ప్రాక్టీస్ చేసేలా ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. పాకిస్థాన్ ప్రాక్టీస్ మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు. టీమిండియా ప్రాక్టీస్ సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు ఇలా రెండు సెషన్ల మధ్య ఒక గంట విరామం ఇచ్చారు. తద్వారా రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్కు ఈ సెపరేట్ ప్రాక్టీస్ వల్ల ఒక కీలక అడ్వాంటేజ్ దక్కినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ సాయంత్రం పూట (రాత్రి వెలుగుల్లో) ప్రాక్టీస్ చేస్తోంది. అసలైన మ్యాచ్ కూడా రాత్రి పూటే జరుగుతుంది కాబట్టి ఫ్లడ్ లైట్ల కింద బంతి ఎలా వస్తుంది? పిచ్ ఎలా స్పందిస్తుంది? ముఖ్యంగా మంచు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అనే విషయాలపై భారత్కు స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పాక్ మధ్యాహ్నం ఎండలో ప్రాక్టీస్ చేయడం వల్ల రాత్రి కండిషన్లపై వారికి పూర్తి పట్టు దొరకకపోవచ్చు.
మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉన్నా, వాతావరణం మాత్రం విలన్ అయ్యేలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఆదివారం కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం 94 శాతం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు పాయింట్లను సమానంగా పంచుతారు. అప్పుడు భారత్, పాకిస్థాన్ రెండూ కూడా నేరుగా సూపర్ 8 దశకు చేరుకుంటాయి. కానీ అసలైన పోరును చూడాలనుకునే క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇది నిరాశ కలిగించే వార్తే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి