టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్.. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. అమీర్ తన వ్యాఖ్యలలో అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద పక్కా టెక్నిక్ లేదని పేర్కొన్నారు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అభిషేక్ తరచూ వికెట్ పారేసుకుంటాడని అమీర్ విశ్లేషించారు. స్థిరత్వం లేని బ్యాటింగ్ వల్ల అతను జట్టుకు భారంగా మారే అవకాశం ఉందని, ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను, స్వింగ్ అయ్యే డెలివరీలను ఎదుర్కోవడంలో అభిషేక్ తడబడతాడని అమీర్ సూచించారు.
ఈ బలహీనతను పాక్ బౌలర్లు వాడుకోవాలని అతను సలహా ఇచ్చారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అవ్వడం అమీర్ వాదనకు బలాన్ని చేకూర్చినట్లు అనిపించినా, అభిషేక్ వంటి విధ్వంసకర బ్యాటర్ను తక్కువ అంచనా వేయడం సరికాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమీర్ వ్యాఖ్యలు కేవలం మైండ్ గేమ్స్ అని, మ్యాచ్కు ముందు భారత ఆటగాడిపై ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి విమర్శలు చేశాడని నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత ఆసియా కప్ ముగిసిన నేపథ్యంలో ఈ ప్రపంచకప్ పోరు ఇరు దేశాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో పిచ్ కండిషన్స్, స్పిన్నర్ల పాత్ర కీలకం కానున్న నేపథ్యంలో, అభిషేక్ వంటి పవర్ ప్లే హిట్టర్ జట్టులో ఉండటం భారత్కు అదనపు బలం. ఏది ఏమైనా, అమీర్ విమర్శలకు అభిషేక్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తోంది.