ICC Rankings : భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. గిల్ బ్యాటింగ్లో అత్యధిక పరుగులు సాధించగా, సిరాజ్ బౌలింగ్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనల తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్లో వారి స్థానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.ఈ సిరీస్లో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ 754 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మరోవైపు, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మొత్తం 23 వికెట్లు పడగొట్టి సిరీస్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఈ ఇద్దరు ఆటగాళ్ల స్థానాలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి.
ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో మెరుగుపడ్డారు. భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అతని రేటింగ్ 754. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించి టాప్-10లోకి దూసుకెళ్లాడు. గిల్ కాకుండా, రిషభ్ పంత్ (7వ స్థానం), యశస్వి జైస్వాల్ (8వ స్థానం) కూడా టాప్-10లో ఉన్నారు. ఈ ముగ్గురు భారతీయ బ్యాట్స్మెన్లు టాప్-10లో ఉండడం భారత క్రికెట్కు శుభపరిణామం. ఇక రవీంద్ర జడేజా 29వ స్థానంలో, కేఎల్ రాహుల్ 36వ స్థానంలో ఉన్నారు.
సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, బౌలర్ల ర్యాంకింగ్స్లో 27వ స్థానంలో ఉన్నాడు. అతని రేటింగ్ 605. సిరాజ్ కంటే ముందు భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (1వ స్థానం) మరియు రవీంద్ర జడేజా (14వ స్థానం) ఉన్నారు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా బుమ్రా కొనసాగుతున్నాడు. అలాగే, కుల్దీప్ యాదవ్ 28వ స్థానంలో, వాషింగ్టన్ సుందర్ 46వ స్థానంలో ఉన్నారు. సిరాజ్ తన ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే టాప్-20లోకి చేరే అవకాశం ఉంది.
భారత ఆటగాళ్ల ప్రస్తుత ర్యాంకింగ్స్
టెస్టులో భారత్ టాప్-5 బ్యాట్స్మెన్లు:
* రిషభ్ పంత్ – 7వ స్థానం
* యశస్వి జైస్వాల్ – 8వ స్థానం
* శుభ్మన్ గిల్ – 9వ స్థానం
* రవీంద్ర జడేజా – 29వ స్థానం
* కేఎల్ రాహుల్ – 36వ స్థానం
టెస్టులో భారత్ టాప్-5 బౌలర్లు:
* జస్ప్రీత్ బుమ్రా – 1వ స్థానం
* రవీంద్ర జడేజా – 14వ స్థానం
* మహ్మద్ సిరాజ్ – 27వ స్థానం
* కుల్దీప్ యాదవ్ – 28వ స్థానం
* వాషింగ్టన్ సుందర్ – 46వ స్థానం