పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఎందుకంటే అవి శరీరానికి అవసరమైన పోషకాల సమాహారం. పాలలో కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ఐరన్ ఫాస్ఫేట్, మాంగనీస్ ఫాస్ఫేట్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్లు A, B, C, D, E, శరీరానికి అత్యవసరమైన ఎమినో ఆమ్లాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాల ద్వారా లభించే ఐరన్ రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. పాలలో ఉండే ఈ పోషకాలు ఎముకల బలానికి, మొత్తం శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి.
ఆయుర్వేదం ప్రకారం.. పాలు నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయి. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. కాబట్టి, వాటిని ఉదయం పూట తాగడం వల్ల పగటిపూట బరువుగా అనిపించవచ్చు. చాలామందికి కడుపునొప్పి లేదా అజీర్ణం కూడా రావడానికి ఇది ఒక కారణం. పాలు తాగడం అనేది పూర్తిగా మీ ఆరోగ్యం – జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఆయుర్వేదం ఆవు పాలను రాత్రిపూట మాత్రమే తాగాలని స్పష్టంగా సూచిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట పాలు తాగడం వల్ల కడుపు నిండి ఉంటుంది.. ఆకలి అనిపించదు. ఇది హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట వేడి పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కండరాలను శాంతపరుస్తుంది.. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇంకా శక్తి కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
రాత్రి సమయంలో అన్నం, చపాతీలు తిన్న తర్వాత, వేడి చేసిన పాలలో కొంచె పంచదార లేదా బెల్లం కలిపి తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగడం వల్ల మలబద్ధకం.. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే బలమైన రోగనిరోధక శక్తి అవసరం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు.
అయితే, డయాబెటిస్ రోగులు.. ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పాలు తాగితే వారి ఇన్సులిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున.. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే పాలు తీసుకోవాలి. పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి, దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..