ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాల వెనుక గ్రహచలనాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. జ్యోతిష్య దృష్టితో పరిశీలిస్తే, ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకున్న అసాధారణ మార్పులకు గ్రహస్థితులే ప్రధాన కారణమని పండితులు విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది కాలంగా నిరంతరంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇటీవల కొంత మేర తగ్గుముఖం పట్టాయి. దీనిని జ్యోతిష్య పండితులు ఒక సంధి కాలం, అంటే బ్రేక్ ఈవెన్ దశగా పేర్కొంటున్నారు. ఈ దశలో తొందరపాటు పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
2026 సూర్య–చంద్ర గ్రహణాల విశేషత
2026 సంవత్సరంలో సంభవించబోయే సూర్య, చంద్ర గ్రహణాలు సాధారణమైనవి కావని జ్యోతిష్య విశ్లేషణ. మహాశివరాత్రి అనంతరం వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించనుండగా, మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో దర్శనమివ్వకపోయినా, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఉంటుందని చెబుతున్నారు.
ముఖ్యంగా మార్చి 3న వచ్చే చంద్రగ్రహణం బంగారం, వెండి ధరలకు కీలక మలుపుగా మారుతుందని పండితుల అభిప్రాయం.
పంచగ్రహ కూటమి – అస్థిరతకు సంకేతం
ఈ ఏడాది గ్రహణాలు పంచగ్రహ కూటమిలో సంభవించడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు – ఈ ఐదు గ్రహాలు ఒకే సమయంలో ప్రభావం చూపే స్థితిలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక అస్థిరత పెరుగుతుందని జ్యోతిష్యంలో పేర్కొనబడింది. బుధుడు, శుక్రుడు సూర్యుడితో సమీపంగా సంచరించడం, చంద్రుడు అత్యంత వేగంగా తన గమనాన్ని మార్చడం వల్ల మార్కెట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషణ.
పరాభవ నామ సంవత్సరం – భద్రతా పెట్టుబడుల వైపు మొగ్గు
ఉగాది 2026తో ప్రారంభమయ్యే పరాభవ నామ సంవత్సరం మార్పులు, ఒడిదుడుకులతో నిండినదిగా జ్యోతిష్య గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి కాలంలో ప్రజలు సహజంగానే భద్రత కోసం బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెట్టే ధోరణి పెరుగుతుంది. దాని ఫలితంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే సూచనలు ఉన్నాయని పండితులు అంటున్నారు.
జ్యోతిష్య సూచన ఏమిటంటే…
ఈ సూర్య, చంద్రగ్రహణాలు పూర్తిగా ముగిసిన తర్వాతే బంగారం, వెండి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక దృష్టితో సూచిస్తున్నారు. గ్రహణాల కాలంలో తొందరపాటు పెట్టుబడులకు దూరంగా ఉండి, పరిస్థితులు స్థిరపడిన తర్వాత వివేకంతో అడుగులు వేస్తే లాభాలు పొందవచ్చని అంటున్నారు. అందువల్ల మార్చి 3, 2026 చంద్రగ్రహణం ముగిసే వరకు ఓర్పుతో వేచి ఉండటం, ఆ తర్వాత అనుకూల సమయాన్ని చూసుకుని పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని జ్యోతిష్య పండితుల సూచిస్తున్నారు.