ప్రస్తుతం బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇటీవల కొద్దిరోజుల పాటు తగ్గగా.. మళ్లీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరికొంతమంది ధరలు ఎప్పుడు పెరుగుతాయో లేదా ఎప్పుడు తగ్గుతాయో తెలియక వెనకడుగు వేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేరు పొందిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకితో పాటు వారెన్ బఫెట్ బంగారం ధరలపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. వారి అంచనాలను చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బంగారం ధరలపై బాంబ్ పేల్చారు.
బంగారం ధరలు పడిపొవచ్చు
బంగారం ధరలు ఎప్పుడైనా పడిపొవచ్చని వారెన్ బఫెట్ స్పష్టం చేశారు. వెండితో పాటు ఇతర మెటల్స్ పారిశ్రామిక రంగంలో ఉపయోగిస్తారు. కానీ గోల్డ్ను ఆభరణాల తయారీకి మినహా వేటికి ఉపయోగించరు. దీంతో బంగారంకు డిమాండ్ తగ్గినప్పుడు ధరలు పడిపోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. భౌగౌళిక రాజకీయ పరిస్థితులు, ఉద్రిక్తతలు, యుద్ద మేఘాలు, రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ప్రజలు భయంతో బంగారం కొనుగోలు చేస్తారని, దీంతో గోల్డ్ రేటు పెరగడం లేదా తగ్గడం అనేది ప్రజల భయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కంపెనీల షేర్లలో పెట్టుపడి పెడితే షేర్ ధర పెరగడమే కాకుండా డివిడెండ్లు, బోనస్ షేర్లు వస్తాయన్నారు. అదే బంగారంపై పెట్టుబడులు పెడితే అలాంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవని వారెన్ బఫెట్ పేర్కొన్నారు.
బంగారం చనిపోయిన ఆస్తి
వారెన్ బఫెట్ బంగారాన్ని చనిపోయిన ఆస్తిగా అభివర్ణిస్తున్నారు. కేజీ బంగారాన్ని లాకర్లో భద్రపర్చుకుంటే అది ఎప్పటికి కేజీగానే ఉంటుంది. ఎన్నేళ్లయినా అది అలాగే ఉంటుంది కానీ అది ఎటువంటి ఉత్పత్తిని సృష్టించదు. అలాగే బంగారం ధర దానంతట అది పెరగదు. అదే వ్యాపారం లేదా భూమిలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో బంగారం అనేది చనిపోయిన ఆస్తి అని వారెన్ బఫెట్ స్పష్టం చేశారు. కాగా మంగళవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులం బంగారంపై రూ.870 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. అటు కేజీ సిల్వర్ రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.