తల్లిదండ్రులు జీవిత కాలంలో చేసిన మంచి, చెడు పనుల ఫలితాలు తమ పిల్లలకు చెందుతాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వారు చేసే పాపాలు పిల్లల్ని శాపాలై వెంటాడుతాయని పెద్దలు చెబుతుంటారు. దీనిపై ప్రఖ్యాత జ్యోతిష్కుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆస్తి, డబ్బు, బంగారం మొదలైన భౌతిక వస్తువులను తమ పిల్లలకు వారసత్వంగా అందిస్తారు. అలాగే అప్పులు కూడా వారి పిల్లలకు సంక్రమిస్తాయి. అదేవిధంగా పాపాలు, పుణ్యాలు, కర్మ ఫలాలు కూడా తరం నుంచి తరానికి సంక్రమిస్తాయని గురూజీ చెబుతున్నారు. గత జన్మల నుంచి వారి కర్మల ఫలాల ఆధారంగా తర్వాత జన్మలో పుడతారని ఆయన అన్నారు. గత జన్మల పాపాలు, కర్మల ప్రకారం దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు జన్మనిస్తాడని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారని, కానీ వారు తమ జీవితాలను ఎలా గడుపుతారు, ఎంత సంపదను కూడబెట్టుకున్నారు, ఎంత భూమిని సంపాదించారు, ఎంత అధికారం సంపాదించారు అనేది ఎంత ముఖ్యమో.. వారు దానిని ఎలా సంపాదించారు అనేది కూడా చాలా ముఖ్యం అని గురూజీ చెబుతున్నారు. ధర్మ మార్గంలో, నిజాయితీగా సంపాదించిన సంపద పిల్లలకు సులభంగా అందుబాటులో ఉంటుంది. వారు ఎదగడానికి అది సహాయపడుతుంది. అధర్మ మార్గంలో నిస్సహాయులను అణచివేయడం, మోసం చేయడం, అధిక వడ్డీ వసూలు చేయడం, బలహీనులను వేధించడం ద్వారా సంపాదించిన సంపద వారి పిల్లలకు కష్టాలను కలిగిస్తాయట. ఇలాంటి సందర్భాలలో వారసులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం, ఆ ఆస్తి నుంచి ఏ విధంగానూ ప్రయోజనం పొందలేకపోవడం వంటివి జరుతాయని గురూజీ చెబుతున్నారు. ఇవన్నీ తల్లిదండ్రుల పాపాలు, పుణ్యాల పరిణామాలేనట.
పాపాలు చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి?
తల్లిదండ్రులు చేసే పుణ్యకార్యాల ఫలితంగా పిల్లలు తమ వారసత్వాన్ని అభివృద్ధి చేసుకోగలరని, కానీ పాపపు పనులు ఆర్థిక ఇబ్బందులు, పురోగతిలో స్తబ్దత, జీవితంలో అసంతృప్తి వంటి సమస్యలకు దారితీస్తాయని గురూజీ అంటున్నారు. అన్యాయమైన పద్ధతులు, అధిక వడ్డీ రేట్లు వసూలు చేయడం, బలహీనులను అణచివేయడం కుటుంబంలోని తరువాతి తరాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంత ఆస్తి, భూమి, సంపద సంపాదించినా అది మూడవ తరం మనుగడ సాగించే అవకాశం ఉండదు. పూర్వకాలం నాటి రాజులు, చక్రవర్తుల విషయంలో కూడా ఇదే జరిగింది. మన తల్లిదండ్రుల పుణ్యాలు, పాపాలు, కర్మలు తరం నుంచి తరానికి సంక్రమిస్తాయి. కాబట్టి ధర్మమార్గాన్ని జాగ్రత్తగా అనుసరిస్తే అది మన భవిష్యత్ తరాల శ్రేయస్సుకు దారితీస్తుందని గురూజీ నీతి బోధ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మతవిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.