భారతదేశంతో సహా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి ఏడుగురిలో నలుగురు డయాబెటిస్తో బాధపడే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా డయాబెటిస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డయాబెటిస్ అనేది రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు మితిమీరి పెరిగిపోయే దీర్ఘకాలిక వ్యాధి.. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం (టైప్ 1) లేదా శరీరం దానిని సద్వినియోగం చేసుకోలేకపోవడం (టైప్ 2) వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే.. డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చెక్కెరను నియంత్రణలో ఉంచడం ముఖ్యం.. దీనికోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి.. అయితే.. షుగర్ ఉన్నవారు రాత్రి వేళ జొన్న రొట్టె తినవచ్చా.. లేదా..? తింటే ఏమవుతుంది అన్న సందేహాలను వ్యక్తపరుస్తుంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం..
మధుమేహాన్ని పూర్తిగా నయం చేసుకోవడానికి లేదా నియంత్రించుకోవడానికి ఆహారంలో మార్పులు తప్పనిసరి. రోజువారీ ఆహారంలో ఒక పూట మిల్లెట్లను.. అంటే.. జొన్నలు, రాగులు, కొర్రలు వంటివి ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మరొక పూట అన్నం తినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే.. అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, క్వాంటిటీ నియంత్రణ ముఖ్యమని తెలిపారు. మూడవ పూట పండ్లు, సలాడ్లు లేదా కూరగాయలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
అయితే.. షుగర్ ఉన్న వారు రాత్రిపూట జొన్న రొట్టెలు తినడం చాలా మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రాత్రిపూట ఒకటి లేదా రెండు జొన్న రొట్టెలను మాత్రమే తినాలి. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని.. ఇంకా షుగర్ కంట్రోల్ ఉంటుందని పేర్కొంటున్నారు. రొట్టెలతో పాటు పులుసు కూరలు, సాధారణ కూరలు తినవచ్చు.. అయితే.. వేయించిన (ఫ్రైడ్) కూరలు లేదా నాన్-వెజ్ ఫ్రైడ్ ఐటమ్స్ అదనపు క్యాలరీలను అందిస్తాయి కాబట్టి వాటిని నివారించడం మంచిది..
అంతేకాకుండా, ఉదయం అల్పాహారంలో ఇడ్లీలు లేదా దోశలు వంటివి తినొచ్చు.. అయితే, తినాలనిపించిన దానికంటే సగం మాత్రమే తినడం మంచిది..ఈ విధంగా రెండు పూటల భోజనం నుండి క్యాలరీలను తగ్గించుకోవచ్చు. రాత్రిపూట పండ్ల బౌల్ తీసుకోవడం ద్వారా కూడా క్యాలరీలు తక్కువగా శరీరంలోకి వెళ్తాయని.. షుగర్ లెవల్స్ తగ్గుతాయని పేర్కొంటున్నారు.
ఆకలి వేసినప్పుడు బజ్జీలు, పునుగులు వంటి వేయించిన, మైదా కలిపిన ఆహారాలను తినకూడదు.. ఇవి అధిక క్యాలరీలను, అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. దీనికి బదులుగా, కీరా (దోసకాయ) వంటి తక్కువ క్యాలరీల, అధిక ఫైబర్ కలిగిన ఆహారాలను ఎంచుకోవడం మంచిది.. ఇది కేవలం నీరు, ఫైబర్, పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు..
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..