వంటిట్లో కూరివేపాకు లేనిది ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా కరివేపాకు తప్పనిసరి. ఇది వేయనిది ఏ కూరకు అంతగా టేస్ట్ రాదు. ఇక నాన్ వెజ్ వంటకాల్లో అయితే కరివేపాకుకు మరింత ప్రత్యేకత ఉంది. దీంతో వంటిట్లో ఎప్పుడూ కరివేపాకు అందుబాటులో ఉంచుకుంటారు. ఇక కరివేపాకు వల్ల కూరకు అదనపు రుచి రావడమే కాకుండా దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారణంతో ఏ కూరలో అయినా కరివేపాకు తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అయితే సామాన్యులకు షాక్ తగిలింది. రోజూ వంటిట్లో వాడే కరివేపాకు ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి మూడు రెట్లు పెరగడంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు.
కిలో రూ.100కు చేరుకున్న ధర
ఈ నెల ప్రారంభంలో కేజీ కరివేపాకు కేవలం రూ.30గా ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.100 వరకు చేరుకకుంది. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం ఈ ధర పలుకుతుంది. కరివేపాకు దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. దీని కారణంగా కరివేపాకు ధరలు భారీగా పెరిగాయి. రానున్న కొన్ని రోజుల వరకు ఇలాగే ధరలు ఉండే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. షాక్ కొట్టే ఈ ధరలతో సామాన్యులు కరివేపాకు వైపే చూడటం లేదు. ధర మరీ ఇంత ఎక్కువగా ఉంటే ఎలా కొనుగోలు చేస్తామంటూ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోల్ సేల్ ధర రూ.55
హోల్సేల్ మార్కెట్ విషయానికొస్తే టన్ను కరివేపాకు రూ.55 పలుకుతుంది. రవాణా ఛార్జీలతో కలిపి కేజీ రూ.60 పడుతుండగా.. వ్యాపారులు కేజీ రూ.100కి విక్రయిస్తున్నారు. చలికాలం కారణంగా ఆకులు సరిగ్గా రావడం లేదు. పొగమంచు వల్ల రంగు మారిపోతుండటంతో పాడైపోతున్నాయి. పాడైనవాటిని విక్రయించడానికి కుదరదు. దీని వల్ల సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగింది. కరివేపాకు పంట అనేది లాభంతో కూడుకున్నది. ఒకసారి పంట వేస్తే 20 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఏడాదికి నాలుగు కోతలు వస్తాయి. కానీ వాతావరణ పరిస్థితులు, చీడపురుగుల సమస్య వల్ల దిగుబడి తగ్గిపోతుంది. ధరలు పెరగడానికి ఇవే కారణాలుగా తెలుస్తోంది,.