చాలామంది పెరుగును తోడుపెట్టేటప్పుడు పాల ఉష్ణోగ్రతను సరిగ్గా గమనించరు. పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడుపెడితే పెరుగు గట్టిగా రాదు, పైగా త్వరగా పులిసిపోతుంది. అర లీటరు పాలకు ఒక చిన్న టీస్పూన్ తోడు సరిపోతుంది, ఎక్కువ వేస్తే అది బ్యాక్టీరియా వృద్ధిని పెంచి పులుపుకు కారణమవుతుంది. అయితే, పెరుగు గట్టిపడిన తర్వాత ఏం చేస్తే అది అస్సలు పులవదు? ఆ అమ్మమ్మ కాలం నాటి రహస్యాలేంటో తెలుసుకుందాం.
ఉల్లిపాయ మ్యాజిక్
ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, పెరుగు గట్టిపడిన తర్వాత అందులో తొక్క తీసిన రెండు మూడు చిన్న ఉల్లిపాయలను వేస్తే, అవి పెరుగులోని పులుపును పీల్చుకుంటాయి. ఇది అత్యవసర సమయాల్లో పెరుగును రెండు రోజుల పాటు తాజాగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది. తోడు పెట్టే సమయంలో పాలు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. తోడు వేసిన తర్వాత గిన్నెను కదపకుండా ఉంచడం వల్ల పెరుగు గట్టిగా, మీగడలా వస్తుంది.
నీటిని తొలగించండి..
పెరుగును నిల్వ చేయండి పెరుగు పులవడానికి ప్రధాన కారణం అందులో ఉండే నీరు. పాలను నీళ్లు కలపకుండా మరిగించినా, పెరుగు తోడుకున్నాక నీరు విడిపోతుంది. ఈ నీటిని తీసేస్తే పెరుగు రెండు వారాల వరకు చెడిపోదు. పెరుగును ఒక తెల్లటి బట్టలో వేసి కాసేపు వేలాడదీస్తే (Hung Curd), నీరంతా పోయి గట్టిగా, క్రీమీగా మారుతుంది. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్లో పెడితే వారం రోజుల పాటు అస్సలు పులవదు.
ఫంగస్ సోకకుండా..
పెరుగు తోడుకున్నాక దానిపై మూత పెట్టే విధానం కూడా ముఖ్యం. పెరుగు గట్టిపడిన తర్వాత దాన్ని ఫ్రిజ్లో పెట్టి, కాసేపు ఆగి పైన పేరుకున్న తేమను తొలగించాలి. దీనివల్ల ఫంగస్ సోకకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మీరు బయట పెరుగు కొనాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పెరుగును ప్రతిరోజూ ఆస్వాదించవచ్చు.