దేశంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ఇప్పటికే అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. రైతులను ఆర్ధికంగా అభివృద్ది పథంలో నడిపించేందుకు వారికి తోడ్పాటు అందిస్తోంది. అనేక కార్యక్రమాలను రైతన్నల కోసం ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ఓ ప్రత్యేక డిజిటల్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది. మంగళవారం జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ డిజిటల్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించారు. దీని ద్వారా రైతులు తమకు అవసరమైన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.
భారత్ విస్తార్ సేవలు
దేశంలో రైతులందరికీ సేవలు అందించేందుకు భారత్ విస్తార్ పేరుతో కేంద్రం ఈ డిజిటల్ సేవలను లాంచ్ చేసింది. ఈ సేవల ద్వారా రైతులు ఒకే కాల్తో ఏ సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు. పంట ఆధారిత శాస్త్రీయ సలహాలు, ధరల వివరాలు, వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. డిజిటల్ ఇండియా దార్శనికతను గ్రామీణ ప్రాంతాలను విస్తరంచడంలో ఈ చొరవ ఉపయోగపడనుందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయమే కాకుండా పశు పోషణ దిశగా రైతులను ముందుకు నడిపించడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడనుంది. రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని, దీని ద్వారా లబ్ది పొందాలని సూచించింది. రైతులు తమ సొంత భాషలోనే ఈ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఫ్లాట్ఫామ్పై సేవలు పొందవచ్చు.
చారిత్రాత్మక అడుగు
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో ఇదొక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. రైతులు తమకు అవసరమైన సేవలు అన్నీ పొందటంలో ఇది సహాయపడుతుందన్నారు. రైతులు తమకు అవసరమైన ప్రతీ సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. జైపూర్లోని దుర్గాపురలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఈ డిజిటల్ ఫ్లాట్ఫామ్ లాంచ్ చేశారు.