ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులకు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేసేందకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే సైకిళ్లను కూడా ఆర్డర్ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే.. కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3,096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3,841, జగిత్యాల జిల్లాలో 1,137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9,348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.
అలానే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అలాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున సైకిళ్లను అందించనున్నారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున అందజేయనున్నారు. ఇక తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆయన ఆర్డర్ కూడా ఇచ్చారు.
ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే.. ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.
టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే..
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక, ఆటోలు, బస్సులలో వెళ్లే స్థోమత లేక కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత కూడా వారు స్పెషల్ క్లాస్లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.
సైకిళ్లకు సంబంధించిన వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.