ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఒకవైపు వేసవి కాలం రాకముందే ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో ఏపీలో వాతావరణం చల్లబడనుంది.
ఈ జిల్లాలకు అలర్ట్
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై దీన్ని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరిలోనే సెగలు..
వర్షాల సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో ఎండల తీవ్రత జనాలను వణికిస్తోంది. సాధారణంగా మార్చి నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఒక నెల ముందుగానే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
రాబోయే మూడు నెలలు గడ్డుకాలమేనా..?
ఇప్పుడే 36 డిగ్రీలు దాటిందంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వాతావరణ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాదితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది.