సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి మాధురి, కూతుర్లు పుష్ప కుమారి, జెస్సీలను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో భర్త లేని సమయంలో ఈ దారుణం జరిగింది. ఘటరపై కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే కాలనీకి చెందిన సురేష్ ఈ హత్యలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే గత కొన్నేళ్లుగా మృతురాలు మాధురితో సురేష్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో ఈ వ్యవహారం భర్తకు తెలియకుండా నడిచింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు మాటలతో భర్తకు కూడా తెలిసింది. అయినప్పటికీ వాళ్ల వ్యవహారం మాత్రం గుట్టుగా నడిపిస్తున్నారు. ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది. దాంతో మాధురిని చంపాలని నిర్ణయించుకున్నాడు సురేష్. దానికి అనుగుణంగా వారం రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నాడు.
మాధురి భర్త ప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో బొలెరో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ ఈ మధ్యకాలంలో తరచూ నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు. మరొకవైపు నిందితుడు సురేష్ కూడా లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇదే సరైన సమయం అనుకుని ఇంట్లో ప్రసాద్ లేని సమయంలో మాధురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. రోజులాగే శనివారం కూడా ప్రసాద్ నైట్ డ్యూటీ కి వెళ్ళాడు అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో మాధురి కూడా అలెర్ట్ అయింది. ఇంటి మెయిన్ డోర్ తాళం వేసి చుట్టూ తిరిగి ఇంటి లోపలికి వెళ్ళేది. భర్త లేని సమయంలో అతి జాగ్రత్త తీసుకునేది. మళ్లీ ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే గొడవ అవుతుందని జాగ్రత్త పడింది.
అయితే శనివారం అర్ధరాత్రి తర్వాత సురేష్ మాధురి ఇంటికి వచ్చాడు. అతని అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. ఇంట్లో మాధురి ఇద్దరు పిల్లలతో సహా నిద్రపోయి ఉంది. ఆ సమయంలో తనతో తెచ్చుకున్న ఐరన్ రాడ్ తో మాధురి తల పగలగొట్టాడు సురేష్. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. తల్లి కేకలకు పిల్లలిద్దరూ నిద్రలేచారు. దీంతో వాళ్ళని కూడా చంపాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. అదే రాడ్ తో వాళ్ల తలలు కూడా పగలగొట్టాడు. అతి కిరాతకంగా బ్లేడ్లతో శరీర భాగాలను కట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ మాధురి మొబైల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు.
ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు మాధురి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మాధురి కాల్ లిస్ట్ కూడా పరిశీలించారు. సురేష్ ని పాలకొల్లులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ హత్యలలో సురేష్ తో పాటు ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది.
మొత్తానికి వివాహేతర సంబంధం మూడు హత్యలకు కారణమైంది.. అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా అర్ధాంతరంగా తనువులు చాలించాల్సి వచ్చింది.. అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడు సురేష్ కనీసం జాలి కూడా లేకుండా పిల్లల్ని చిదిమేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మరింత సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.