నవోదయలో చేరేందుకు ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న 11 ఏళ్ళ విద్యార్ధి బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. ఏడాది కాలంగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధి బాత్రూమ్లో ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ సెంటర్ వార్గెన్ విద్యార్ధిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్ధి సంఘాల మద్దతుతో ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో శ్రీచైతన్య స్కూల్ పేరుతో నవోదయ – సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో నవోదయలో ఎంట్రన్స్ పరీక్షలు రాసేందుకు కనిగిరికి చెందిన 11 ఏళ్ళ సయ్యద్ తౌఫిక్ ఏడాది కాలంగా కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే శనివారం రాత్రి విద్యార్థి తైఫిక్ బాత్రూమ్లో ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అప్పటి వరకు ఫోన్లో తల్లిదండ్రులతో కులాసాగా మాట్లాడిన తౌఫిక్ ఉన్నట్టుండి బాత్రూమ్లో ఉరివేసుకుని చనిపోయినట్టు ఫోన్ రావడంతో తల్లిదండ్రులు వెంటనే కోచింగ్ సెంటర్కు చేరుకున్నారు.
అయితే వార్డెన్ బాబ్జీ పలుమార్లు తమ బిడ్డను కొట్టినట్టు తెలిసిందని, ఇప్పుడు కూడా తౌఫిక్ను వార్డెన్ బాబ్జీ కొడితే స్పృహ తప్పడంతో ఈ విషయం ఎక్కడ బహిర్గత మవుతుందనే భయంతో విద్యార్ధిని గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు పరిశీలించగా మరుగు దొడ్డిలో ఉరివేసుకున్న స్థితిలో చనిపోయినట్టు స్కూలు యాజమాన్యం కట్టుకథలు చెబుతోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. బాలుడిని దగ్గర్లో ఉన్న సింగరాయకొండలోని ఆసుపత్రికి కాకుండా దూరంగా ఉన్న కందుకూరు ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళారని ప్రశ్నిస్తున్నారు
తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని బాధిత కుటుంబం విద్యార్థి సంఘాల సహకారంతో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. తమ కుమారుడి చావుకు కారణ అయిన స్కూలు గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విద్యార్ధి తల్లిదండ్రుల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసువడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఆందోళనకారులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.