ఐఏఎస్ అధికారినంటూ మాయమాటలు చెప్పి జనాలను బురిడీ కొట్టించిన ఓ కేటుగాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఐపిఎస్ అధికారినని, డిటెక్టివ్ ఆఫీసర్నని, NIA అధికారి నంటూ సందర్భానికి తగ్గట్టు అధికారి గెటప్ మార్చుతూ జనాలను బురిడీకొట్టించాడు. తాను ఢిల్లీ నుండి వచ్చానని ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న ఈ కేటుగాడు.. అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏకంగా అతడి నుంచి రూ.1.5లక్షలు కాజేశాడు. అయితే సురేష్ తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఐపీఎస్ అధికారి బండారాన్ని బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఆటోనగర్లో ఉంటున్న వెంకటేశ్వరరావు అనే యవకుడు స్విమ్స్ ఆసువత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో రాపిడో నడిపేవాడు. అయితే ఒక రోజూ రాపిడో బుకింగ్లో వెంకటేశ్వర్కు సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఢిల్లీ ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారినని, ఇటీవల పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీ అయ్యానని మాయమాటలు చెప్పి అతనితో పరిచయం చేసుకున్నాడు. వెంకటేశ్వరరావుకు ఉద్యోగం లేదని.. హైదరాబాద్లోని ఆదాయపన్ను కార్యాలయంలో డివిజనల్ అడ్వైజర్ ఉద్యోగం ఉందని.. కావాలంటే రీప్లేస్మెంట్ కోటాలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని వెంకటేశ్వర్రావును నమ్మించాడు. అది నిజమని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా సుమారూ.1.50లక్షల వరకు అతని ముట్టజెప్పాడు.
అయితే డబ్బులు ముట్టాక సురేష్ ప్రవర్తనలో మార్పు రావడంతో వెంకటేశ్వరరావుకు అనుమానం వచ్చి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. సురేష్ తన డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో వెంకటేశ్వరరావు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హజరుపర్చగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.