
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన శివభక్తుడు చిలక భార్గవ సాయితేజ, తన అసాధారణ భక్తితో ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని రూపొందించాడు. సాధారణ నాణాలకు ఆధ్యాత్మిక విలువను ఆపాదించి, సుమారు రూ. 1.3 లక్షల విలువైన నాణాలతో ఈ శివలింగాన్ని తయారుచేశారు. తన కలలో శివుడు నాణాలతో శివలింగం చేయమని ఆదేశించాడని, ఆ కలను శివుడి ఆజ్ఞగా భావించి ఈ కార్యానికి పూనుకున్నానని సాయితేజ వెల్లడించాడు. రెండు నెలల పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణాలను సేకరించాడు. స్నేహితులు, ఇతర భక్తులు ఈ నాణాల సేకరణలో అతడికి సహకరించారు. సాయితేజ తండ్రి చిలక గంగేశ్వరరావు, తల్లి యోజన కపూసి రత్నం. చిన్నప్పటి నుంచీ శివుడంటే తనకు ఎంతో ఇష్టమని సాయితేజ తెలిపాడు.
ఈ ధనలింగాన్ని పట్టిసీమలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించి, మహాశివరాత్రి సందర్భంగా నిత్య పూజలు జరిగేలా చూడాలనే ఆలోచనతో ఈ బృహత్కార్యాన్ని చేపట్టాడు. గతంలో సాయితేజ అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు కాలినడకన పాదయాత్ర చేశాడు. ఆ అనుభవం తన జీవితాన్ని మార్చిందని, తిరిగి వచ్చాక తన ఇంటి దగ్గర శబరిమల ఆలయ నమూనాలోనే ఒక చిన్న గుడిని నిర్మించుకున్నానని తెలిపాడు. ఆ ఆధ్యాత్మిక స్ఫూర్తితోనే ఇప్పుడు నాణాలతో శివలింగాన్ని తయారుచేశానని వివరించాడు. శివయ్య ఆజ్ఞ లేనిదే ఏమీ చేయలేమని, ఈ శివలింగ నిర్మాణం కూడా ఆయనే చేయించారని సాయితేజ దృఢంగా నమ్ముతున్నాడు.