రైల్లో చాక్లెట్లు తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్ట్.. అదేంటి.. ట్రైన్లో చాక్లెట్లు తీసుకెళ్లకూడదని రూలేం లేదు కదా అనుకోకుండి. అవి అలాంటి ఇలాంటి చాక్లెట్లు కాదండోయ్.. మత్తైన.. గమ్మత్తైన చాక్లెట్స్. ఇవి ఒకసారి తింటే చాలు చిన్నారులు అస్సలు వదల్లేరు. అవే కావాలని మారాం చేస్తారు. ఎందుకంటే అవి గంజాయితో చేసిన చాక్లెట్స్ కాబట్టి. గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన తనిఖీల్లో పోలీసులకు ఇతగాడు చిక్కాడు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వద్ద ఈగల్ సెల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, అనంతపురం త్రీ టౌన్ పోలీసులు సంయుక్తంగా రైల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఒడిశాకు చెందిన వ్యక్తి సాల్మన్ వద్ద గంజాయితో తయారైన 219 మత్తు చాక్లెట్లు పట్టుబడ్డాయి. ఇవి చూస్తే మామూలు చాక్లెట్లే అనిపించొచ్చు… రంగురంగుల కవర్లతో ఆకట్టుకునేలా ఉంటాయి కానీ… ఆ చాక్లెట్ల వెనక మత్తు మాయ ఉందన్న సంగతి ఎవ్వరికీ తెలియదు.
నిందితుడిని విచారించగా.. ఈ చాక్లెట్లు భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు తీసుకెళ్తున్నానని అంగీకరించాడు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూల్స్, కాలేజీల సమీపాల్లో ఉండే దుకాణాల్లో ఇవి అమ్ముతుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు మత్తు చాక్లెట్లు పిల్లలకు అడిక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా రెడీ చేసినట్టు సమాచారం. సాల్మన్ను అరెస్టు చేసి అనంతపురం జీఆర్పీ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. చాక్లెట్ రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మధ్య ఇలాంటి చాక్లెట్లను తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా సీజ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..