మీ బైక్ లేదా కార్ ఎక్కడైనా పార్కింగ్ చేస్తే దొంగతనానికి గురైతే, వెంటనే తెలుసుకోవడానికి జిపీఎస్ వాడతారు కదా… అలానే గ్రామీణ ప్రాంతాల్లో, పంట పొలాల్లో దొంగలు వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, స్ప్రింక్లర్లు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తున్నారు. వీరి బారినుంచి తన పొలాన్ని రక్షించుకోవడానికి ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. దొంగల్ని పట్టుకోవడానికి టెక్నాలజీని ఆయుధంగా మార్చాడు.
శ్రీ సత్య సాయి జిల్లా, పెనుకొండ మండలం సత్తార్పల్లికి చెందిన రైతు అశోక్ రెడ్డి పొలంలో గత కొంతకాలంగా డ్రిప్ పైపులు, వ్యవసాయ పరికరాలు తరచూ దొంగతనానికి గురవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మూడుసార్లు దొంగతనాలు జరిగాయి. దొంగల బారి నుంచి తమ వస్తువులు కాపాడేందుకు.. అశోక్ రెడ్డి కొన్ని రోజులు తన పొలంలోనే కాపలా కూడా కాశారు. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండడం సాధ్యం కాదు కదా. అప్పుడు ఆ రైతు మనసులో ఓ ఆలోచన మెరిగింది. వ్యవసాయ పరికరాలకూ జీపీఆర్ఎస్ ట్రాకింగ్ అమర్చితే ఎలా ఉంటుందనే ఐడియా యూట్యూబ్ లో చూశాడు. వెంటనే అమెజాన్ నుంచి జీపీఆర్ఎస్ పరికరం ఆర్డర్ చేసి, తన పొలంలోని పరికరాలకు, డ్రిప్ పైపులకు అమర్చేశాడు.
రెండు రోజుల క్రితం తెల్లవారుజామున 4 గంటలకు జీపీఆర్ఎస్ పరికరం సిగ్నల్ మార్చింది. పొలంలో ఉండాల్సిన డ్రిప్ పైపులు మళ్లీ ఓ వేరే లొకేషన్లో కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అశోక్ రెడ్డి.. మరికొంతమంది రైతులతో కలిసి ఆ ట్రాకింగ్ను ఫాలో అయ్యాడు. ఓ బొలెరో వాహనంలో డ్రిప్ పైపులు తరలిస్తున్న దొంగలను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఓ చిన్న యాప్ సహాయంతో రైతు అశోక్ రెడ్డి చేసిన తెలివైన పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే… రైతులు కూడా ఎంత దూకుడుగా తమ ఆస్తిని కాపాడుకోగలరో ఈ ఘటన తెలియజేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..